
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.500 జరిమాన పడింది. అదేంటి ప్రపంచకప్లో భారత్ ఆడింది ఒక్క మ్యాచ్. అది కూడా సమయంలోగా మ్యాచ్ ముగిసింది కదా.. మరి కోహ్లీకి జరిమాన ఎందుకు పడింది అని ఆలోచిస్తున్నారా?. కోహ్లీకి మ్యాచ్ ఆడుతుండగా ఫైన్ పడలేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఆప్ గురుగ్రామ్ (ఎంసీజీ) కోహ్లీకి జరిమాన విధించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
విషయంలోకి వెళితే.. గురుగ్రామ్లోని డీఎల్ఎఫ్ ఫేజ్-1లో విరాట్ కోహ్లీ నివాసముంటున్నాడు. కోహ్లీకి కార్లపై ఇష్టం ఉండడంతో తన గ్యారేజి ఎప్పుడూ కూడా కార్లతో నిండి ఉంటుంది. ప్రస్తుతం కోహ్లీ ఇంటి ఆవరణలో ఆరు కార్లకు పైగా ఉన్నాయి. కార్లను రోజు మంచి నీటితో శుభ్రచేస్తుండటాన్ని గమనించిన విరాట్ పొరిగింటి వ్యక్తి ఎంసీజీకి ఫిర్యాదు చేశాడు.
కార్లు శుభ్రం చేసేందుకు రోజు వేల లీటర్ల మంచి నీటిని వృథా చేస్తున్నారని ఆ వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు మేరకు ఎంసీజీ విచారణ చేపట్టింది. మంచి నీటి వృథా నిజమేనని ఎంసీజీ అధికారులు తేల్చారు. దీంతో ఎంసీజీ.. కోహ్లీకి రూ.500 జరిమాన విధించింది. విరాట్తో పాటు ఆ ప్రాంతంలోని ఇతర ఇళ్లలో సైతం మంచి నీటిని వృథా చేసిన వారిపై ఎంసీజీ అధికారులు జరిమానా విధించారు. ఉత్తర భారతదేశం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటోంది. నీటి కొరతను పరిష్కరించేందుకే ఈ ఫైన్ వేశామని మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ యష్పాల్ యాదవ్ చెప్పారు.
ప్రపంచకప్ టోర్నీలో భాగంగా విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లండ్లో ఉన్నాడు. ఆదివారం టీమిండియా ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్ ఆడుతోంది. టాస్ నెగ్గిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా భారత బ్యాటింగ్ సాగుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (32), శిఖర్ ధావన్ (46)లు ఆచితూచి ఆడుతున్నారు. ఆసీస్ పేస్, స్పిన్ బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం భారత్ 16 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 81 పరుగులు చేసింది.