హైదరాబాద్: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో దురుసుగా ప్రవర్తించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ జరిమానా విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1ను ఉల్లంఘించినందుకుగాను కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆట సందర్భంగా అంపైర్లు, రిఫరీతో కోహ్లీ వ్యవహరించిన తీరును ఐసీసీ తప్పుబట్టింది. సోమవారం మూడో రోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఔట్ ఫీల్డ్ గురించి పదేపదే అంపైర్ మైకేల్ గాఫ్కు ఫిర్యాదు చేసిన కోహ్లీ.. తన అసంతృప్తిని బాహాబాటంగా వ్యక్తం చేసి బంతిని బలంగా నేలకేసి కొట్టాడు.
Kohli received one demerit point for breaching Level 1 of the code of conduct during third day's play of second South Africa Test https://t.co/NHEDkxMlwd #cricket @icc
— ICC Media (@ICCMediaComms) January 16, 2018
ఇది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధన ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలడంతో కోహ్లీకి మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 25 ఓవర్లో అంపైర్ గాఫ్ వద్దకు వెళ్లిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔట్ ఫీల్డ్ గురించి ఫిర్యాదు చేశాడు.
వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ జరిగే క్రమంలో ఔట్ ఫీల్డ్ బాగాలేదని, దాని ప్రభావం బంతిపై తీవ్రంగా పడుతుందని అంపైర్ గాఫ్కు విజ్ఞప్తి చేశాడు. అయితే కోహ్లీ నిర్ణయంతో అంపైర్ ఏకీభవించక పోవడంతో బంతిని నేలకు కొట్టి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దీంతో కోహ్లీపై ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు.
దీనిపై తాను తప్పుచేసినట్లు మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ అంగీకరించడంతో అతడికి 25 శాతం జరిమానాతోనే సరిపెడుతున్నట్లు మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ పేర్కొన్నారు. అదే విధంగా కోహ్లీకి ఒక డీమెరిట్ పాయింట్ను కూడా జత చేశారు. అంపైర్ నిర్ణయంతో విభేదించడంతో పాటు దురుసుగా ప్రవర్తించినట్లు కోహ్లీ ఒప్పుకోవడంతో తదుపరి విచారణ అవసరం లేదని బ్రాడ్ తెలిపారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.