
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేముందు జట్టు సన్నద్ధమవ్వడానికి తగినంత సమయం ఉండాలన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాటలతో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అండగా నిలిచాడు. క్రికెట్ షెడ్యూల్ విషయంలో కోహ్లీ ఆవేదన నిజమేనని అన్నాడు. 'క్రికెట్ షెడ్యూల్ కోసం కోహ్లీ వ్యాఖ్యలు సరైనవే. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేముందు జట్టు సన్నద్ధమవ్వడానికి తగినంత సమయం ఇవ్వాలి' అని దాదా చెప్పాడు.
రెండో టెస్టు మ్యాచ్కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వకుండా వరుస క్రికెట్ సిరీస్లు నిర్వహిస్తున్న బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వరుస సిరీస్లు నిర్వహించేటప్పడు ఆటగాళ్ల కోణంలో సైతం ఆలోచించాలని బీసీసీఐకి హితవు పలికాడు.
'దురదృష్టవశాత్తూ శ్రీలంకతో ఈ సిరీస్ ముగిసిన తర్వాత రెండు రోజులకే దక్షిణాఫ్రికా ఫ్లయిటెక్కాల్సి ఉంది. దీంతో మాకు ఉన్న ఈ ఒక్క అవకాశం వాడుకోవడం తప్ప మరో దారి లేదు. కనీసం ఓ నెల గడువు దొరికినట్టయితే.. మేం సరిగ్గా ఈ పర్యటనకు సన్నద్ధమై ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు మాకు ఇచ్చిన సమయంలోనే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సహజంగా విదేశీ పర్యటనలు అంటే జట్టు తగినంతగా సన్నద్ధం కావడానికి సమయం ఇస్తారు. కానీ ఇప్పుడు మాకు ప్రిపరేషన్ కోసం ఎన్ని రోజులు ఉన్నాయో తెలియని పరిస్థితి' అని కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు.
డిసెంబర్ 24తో శ్రీలంతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ముగియనుంది. ఆ తర్వాత రెండు రోజులకే డిసెంబర్ 27న కోహ్లీసేన దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనుంది. దీంతో సిరీస్కు సిరీస్కు మధ్య కనీసం కొంతైన సమయం ఉండేలా షెడ్యూల్ ఉండాలని కోహ్లీ బీసీసీఐకి స్పష్టంగా చెప్పినప్పటికీ అలా జరగలేదు. కోహ్లీ వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిన బీసీసీఐ.. ఈ విషయాన్ని సీరియస్గా పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించింది.
కోహ్లీ చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా సమర్ధించారు. అంతేకాదు దీనిపై సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆటగాళ్లకు విశ్రాంతి లేకుండా తక్కువ సమయంలో మూడు వరుస సిరీస్లను షెడ్యూల్ చేయడంపై బోర్డు సభ్యులు మరోసారి ఆలోచించాలని ఖన్నా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ 'విరాట్ కోహ్లీ ఇండియన్ టీమ్ కెప్టెన్. అతని అభిప్రాయాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. టీమ్ రాణిస్తున్నా.. ప్లేయర్స్ అలసిపోతున్నారంటే ఇది సీరియస్గా చర్చించాల్సిన విషయం' అని ఖన్నా అన్నాడు.