హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో గురువారం మరో అరుదైన రికార్డు చేరింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో కోహ్లీ 96 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఈ మ్యాచ్లో చేసిన 96 పరుగులతో కోహ్లీ 8 వేల పరుగుల క్లబ్లో చేరాడు. అంతేకాదు అత్యంత వేగంగా 8000 వేల పరుగుల మైలురాయిని అందుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ రికార్డుని కూడా బద్దలు కొట్టాడు.

అంతకు ముందు సౌరవ్ గంగూలీ పేరటి ఉన్న ఈ రికార్డును డివిలియర్స్ 2015 ఆగస్టులో చెరిపేశాడు. 8వేల పరుగులు చేయడానికి గంగూలీ 200 ఇన్నింగ్స్ ఆడాడు. ఈ 8వేల క్లబ్లో చేరడానికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 210 ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. గతంలో వేగంగా 7వేల పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
అయితే ఆ రికార్డును దక్షిణాఫ్రికా ఓపెనర్ హసీం ఆమ్లా బ్రేక్ చేశాడు. 7వేల పరుగులు చేయడానికి కోహ్లి 166 ఇన్నింగ్స్ ఆడగా.. ఆమ్లా 150 ఇన్నింగ్స్ మాత్రమే తీసుకున్నాడు. దీంతో పాటు వేగంగా 2వేలు, 3వేలు, 4వేలు, 5వేలు, 6వేలు పరుగులు పూర్తిచేసిన రికార్డులన్నీ ఆమ్లావే. ఇప్పటి వరకు 153 మ్యాచ్లు ఆడిన ఆమ్లా.. 7186 పరుగులు చేశాడు.
వన్డేల్లో 8వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి కోహ్లీ 175 ఇన్నింగ్స్ పట్టగా, ఏబీ డివిలియర్స్ ఈ ఘనతను 182 ఇన్నింగ్స్ల్లో సాధించాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వీరిద్దరూ ఈ ఘనతను సాధించారు.
ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో 59 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 46 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 77 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 96 పరుగులు సాధించాడు.
తాజా విజయంతో ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో పాకిస్థాన్తో టీమిండియా తలపడనుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(123; 129 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సు నాటౌట్), శిఖర్ ధావన్, (46; 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 87 పరుగులు జోడించారు.