కోహ్లీ అరుదైన ఘనత
తాజాగా ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కూడా చేరాడు. అయితే సచిన్ టెండూల్కర్ వెయ్యి పరుగుల మార్క్ని 20 టెస్టుల్లో చేరుకోగా.. కోహ్లీ మాత్రం కేవలం 9 టెస్టుల్లోనే అందుకోవడం విశేషం. అంతేకాదు ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ రికార్డుని సైతం కోహ్లీ అధిగమించాడు. ఆస్ట్రేలియా గడ్డపై డాన్ బ్రాడ్మన్ వెయ్యి పరుగుల మార్క్ని 10 టెస్టుల్లో చేరుకున్నాడు.
31వ ఓవర్లో నాథన్ బౌలింగ్లో ఔట్
భారత రెండో ఇన్నింగ్స్ 31వ ఓవర్లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ వేసిన మూడో బంతిని స్వేర్లెగ్ ఆడి సింగిల్ తీయడంతో విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ జాబితాని ఓసారి పరిశీలిస్తే సచిన్ టెండూల్కర్ 1,809 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
నాలుగో భారత బ్యాట్స్మన్గా కోహ్లీ
ఆ తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ 1,236 పరుగులు (15 టెస్టుల్లో), రాహుల్ ద్రవిడ్ 1,143 పరుగులు (15 టెస్టుల్లో) కొనసాగుతున్నారు. సెహ్వాగ్ కూడా ఆస్ట్రేలియాలో 1,000 చేశాడు. అయితే ఇందులో 83 పరుగులు ఐసీసీ వరల్డ్ ఎలెవన్ టీమ్ తరఫున ఆడి చేసినవి కావడం విశేషం. ఈ రికార్డుతో పాటు కోహ్లీ మరో ఘనతనూ సాధించాడు. అతడి వ్యక్తిగత స్కోరు 16 వద్ద కెప్టెన్గా స్వదేశం, విదేశంలో రెండు వేల పరుగులు పూర్తి చేశాడు.
ప్రపంచంలోనే ఐదో కెప్టెన్గా కోహ్లీ
ప్రపంచంలోనే ఈ రికార్డు సాధించిన ఐదో కెప్టెన్గా నిలిచాడు. అతడికంటే ముందు అలెన్ బోర్డర్, రికీ పాంటింగ్, గ్రేమ్ స్మిత్, అలిస్టర్ కుక్ ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, తొలి టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 151/3తో నిలిచింది. పుజారా(40), రహానే(1) క్రీజులో ఉన్నారు.
|
235 పరుగులకే ఆలౌటైన ఆస్ట్రేలియా
ఓవర్నైట్ స్కోరు 191/7తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 235 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకోవడంతో ప్రస్తుతం భారత్ 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆటలో భాగంగా కోహ్లీ(34) ఆఖర్లో పెవిలియన్కు చేరాడు. ఈ కోహ్లీని ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో కోహ్లీని ఎక్కువసార్లు పెవిలియన్కు చేర్చిన బౌలర్గా నాథన్ లియాన్ అరుదైన ఘనత సాధించాడు. లియాన్ కోహ్లీని ఆరుసార్లు ఔట్ చేయగా.. అండర్సర్, స్టువర్ట్ బ్రాడ్ ఐదేసి సార్లు ఔట్ చేశారు.