విరాట్ కోహ్లీ అంటే కేవలం క్రికెటర్ మాత్రమే కాదు. అతనో ఎమోషన్. అలాంటి కోహ్లీ మూడేళ్లపైగా ఫామ్ లేక తంటాలు పడినప్పుడు దేశంలో ఎందరి మనసులు బాధతో మెలితిరిగాయో చెప్పాల్సిన అవసరం లేదు. అతని సెంచరీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన వారి సంఖ్యకు అంతం లేదు. అలాంటి వారిలోనే ఒకడు అమన్ అగర్వాల్. కోహ్లీకి వీరాభిమాని అయిన అతను.. గతేడాది భారత్ ఆడుతున్న ఒక మ్యాచ్కు వచ్చాడు.
స్టేడియంలో కూర్చొని 'కోహ్లీ 71వ సెంచరీ చేసే వరకు నేను పెళ్లి చేసుకోను' అని రాసి ఉన్న సైన్ బోర్డు పట్టుకొని కనిపించాడు అమన్. ఇలా చాలా మంది అభిమానులు కోహ్లీ సెంచరీ కోసం ఎదురు చూసిన వాళ్లే. వాళ్లందరి ఆశలు తీర్చిన కోహ్లీ.. ఆసియా కప్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత మళ్లీ బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో కూడా అద్భుతమైన శతకంతో అలరించాడు. దీంతో అమన్ కోరిక తీరింది కదా. దాంతో మూడు ముళ్ల బంధానికి రెడీ అయిపోయాడీ క్రికెట్ లవర్.
ఇక్కడే అతనికి ఇక సర్ప్రైజ్ దక్కింది. అది ఇచ్చింది కూడా విరాట్ కోహ్లీ. అమన్ పెళ్లి చేసుకున్న రోజునే శ్రీలంకతో భారత జట్టు చివరి వన్డే ఆడింది. ఆ మ్యాచ్లో కోహ్లీ ఏ రేంజ్లో రెచ్చిపోయాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇదే విషయాన్ని చెప్తూ అమన్ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 'నేను 71వ సెంచరీ అడిగా. కానీ నాకు ప్రత్యేకమైన రోజున కోహ్లీ తన 74వ సెంచరీ చేశాడు' అని ట్వీట్ చేశాడు. దీంతోపాటు టీవీ పక్కనే పెళ్లి దుస్తుల్లో తను నిలబడిన ఫొటో పోస్ట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు అతనికి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.