Virat Kohli: ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల ఉత్సాహం, అభిమానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సారి ఒక అభిమాని చేసిన పని అందరినీ షాక్కు గురి చేసింది. విరాట్ కోహ్లీ పోస్టర్ ముందు ఒక అభిమాని బ్లేడ్తో తన మణికట్టుకు కోసుకుని ఆ రక్తంతో విరాట్ కోహ్లీకి రక్త తిలకం దిద్దిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి విరాట్ కోహ్లీ పోస్టర్ ముందు నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి తన చేతిలో ఒక బ్లేడ్ను పట్టుకుని దానితో తన మణికట్టును కోసుకుని కారుతున్న రక్తంతో విరాట్ కోహ్లీ పోస్టర్కు తిలకం దిద్దుతూ కనిపించాడు. ఈ వీడియోను చూసిన వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు వినియోగదారులు "కోహ్లీ పట్ల ఈ వ్యక్తి హృదయంలో ఎంత ప్రేమ ఉంది, తన రక్తంతో తిలకం దిద్దుతున్నాడు" అని కామెంట్లు చేశారు. మరికొందరు "ఇంతటి పిచ్చి అభిమానం కూడా ప్రమాదకరం" అని హెచ్చరించారు. ఇంకొక వినియోగదారు ఈ విధమైన చర్యను ఖండించారు. ఇలా పిచ్చిగా ప్రవర్తించవద్దని చాలా మంది తీవ్రంగా స్పందించారు.

బెంగళూరులో విషాద ఘటన
ఇటీవలే బుధవారం బెంగళూరులో ఆర్సీబీకి ఘన స్వాగతం లభించింది. అయితే ఈ వేడుక కాస్త విషాదంగా మారింది. చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో దాదాపు 11 మంది మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్ట్ అయిన వారిలో ఆర్సీబీ టాప్ మార్కెటింగ్ అధికారి నిఖిల్ సోసాలే కూడా ఉన్నాడు. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు బెంగళూరులోని కెంపె గౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబై వెళ్తుండగా అతడిని అరెస్ట్ చేశారు.