హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురువారం 36వ పుట్టిన రోజుని జరుపుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని వైదొలగడంపై ఓ నిర్ణయం తీసుకోవాలని సమయం వచ్చిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరో రెండేళ్లలో వచ్చే వన్డే వరల్డ్ కప్ లో ధోని ఉంటాడా లేదా అనేది ప్రధానమైన చర్చ.
ఈ క్రమంలోనే ధోని వీడ్కోలు గురించి విరాట్ కోహ్లికి తాజాగా ఊహించని ప్రశ్న ఎదురైంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు ఐదో వన్డే గెలిచి సిరీస్ను కైవసం చేసుకున్న అనంతరం కోహ్లిని ధోని గురించి ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్న ఇబ్బంది పెట్టింది. కోహ్లీకి నిజంగా ఇది ఊహించని ప్రశ్నే.

దీంతో ఏమి చెప్పాలో అర్ధం కాక కాసేపు అలా ఉండిపోయాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ధోనికి మద్దతుగా నిలవడం విశేషం. "అతని గురించి మేము చెప్పడానికి ఏమీ లేదు. ధోని ఎప్పుడు రిటైర్ కావాలి అనేది అతనికి తెలుసు. ధోని అద్భుతంగా బంతిని స్ట్రయిక్ చేస్తున్నాడు. క్లిష్ట సమయాల్లో ఇన్నింగ్స్ను ఎలా నిర్మించాలో ధోనికి చెప్పాల్సిన అవసరం లేదు' అని వెస్టిండిస్పై ఐదు వన్డేల సిరిస్ను గెలిచిన అనంతరం మీడియా సమావేశంలో చెప్పాడు.
ఆంటిగ్వా వేదికగా వెస్టిండిస్తో జరిగిన నాలుగో వన్డేలో ధోని పరుగులు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యాడు. 114 బంతుల్లో కేవలం 54 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో వెస్టిండిస్ చేతిలో 11 పరుగుల తేడాతో కోహ్లీసేన ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీనిపై కూడా కోహ్లీ స్పందించాడు.
"మనం ఆడే వికెట్ను బట్టి పరుగులు రాబట్టడం అనేది ఆధారపడి ఉంటుంది. గత కొన్ని రోజులుగా నెట్ ప్రాక్టీస్లో స్పిన్నర్లతో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే విండిస్ వికెట్లపై స్టోక్స్ ఆడేందుకు వీలు పడటం లేదు" అని కోహ్లీ పేర్కొన్నాడు. ప్రాక్టీస్లో ఓ ఆటగాడి ఫామ్ని జడ్జి చేయడం చాలా కష్టమని, అయితే ఎటువంటి వికెట్పై ఆడుతున్నామనేది కూడా పరుగులు రాబట్టడం కీలకపాత్ర పోషిస్తుందని కోహ్లీ చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ధోని కీలక ఇన్నింగ్స్ ఆడిన వైనాన్ని కోహ్లీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు.