మిస్టర్ కూల్ అందుకే..
సాధారణంగా- ధోనీ మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగుతుంటాడు. బ్యాటింగ్ ఆర్డర్లో అయిదో స్థానం అతని కోసం ఫిక్స్ చేశారు. ఓపెనర్లు గానీ, టాప్ ఆర్డర్ గానీ విఫలమైనప్పుడు మిడిలార్డర్లో ధోనీ ఎలా క్రీజులో నిలదొక్కుకుంటాడో మనకు బాగా తెలుసు. వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయగల సత్తా అతనికి ఉంది. వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ.. కూల్గా ఉండటం, నిలదొక్కుకుని భారీ షాట్లు ఆడటం, బౌలర్పై ఎదురుదాడి చేయడం ధోనికి వెన్నతో పెట్టిన విద్య. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ధోనీకి మద్దతు ఇచ్చే వాళ్లు ఉంటే చాలు! ఎంత భారీ స్కోరైనా ఇట్టే సాధించేస్తాడతను. దీనికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. పలు మ్యాచుల్లో ధోనీ నాటౌట్గా నిలిచి, జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి.
ధోనీని వెనక్కి నెట్టిన మేనేజ్మెంట్
మాంచెస్టర్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో ధోనీ ఎప్పట్లాగే అయిదో స్థానంలో బ్యాటింగ్కు దిగలేదు. ధోనీ స్థానాన్ని వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తిక్ ఆక్రమించాడు. ఆరో బ్యాట్స్మెన్గా కూడా ధోనీ కనిపించలేదు. ఆ స్థానంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య క్రీజులోకి దిగాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన రిషబ్ పంత్ అవుటైన తరువాత ఏడో బ్యాట్స్మెన్గా క్రీజులోకి వచ్చాడు ధోనీ. అప్పటికి జట్టు స్కోరు 71. అయిదు వికెట్లను కోల్పోయి, 23 ఓవర్లలో ఆ మాత్రం స్కోరు చేసింది టీమిండియా. అప్పటికే క్రీజులో ఉన్న పాండ్యాతో కలిసి కుదురుకున్నాడు. దీనికోసం చాలావరకు డాట్ బాల్స్ తీసుకోవాల్సి వచ్చింది.
|
వికటించిన ప్రయోగం..!
నిజానికి- అయిదో స్థానంలోనే అంటే హార్దిక్ పాండ్యాకు బదులుగా ధోనీని పంపించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు విశ్లేషకులు గానీ, క్రికెట్ పండితులు గానీ. ధోనీ స్థానంలో వచ్చిన హార్దిక్ పాండ్యా తన శైలికి భిన్నమైన ఆటతీరును ప్రదర్శించాడు. మందకొడిగా ఆడాడు. డాట్ బాల్స్ ఎక్కువగా తీసుకున్నాడు. 62 బంతుల్లో 32 పరుగులు మాత్రమే చేశాడు. ఆ మాత్రం దానికి హార్దిక్ను ఎందుకు అయిదో స్థానంలో పంపించాల్సి వచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధోనీని అదే స్థానంలో పంపించి ఉంటే- డెత్ ఓవర్లు సమీపించే సరికి కుదురకుని ఉండేవాడని, భారీ షాట్లు ఆడే వాడని అంటున్నారు.
పరిస్థితి సున్నితంగా మారడం వల్లే..
దీనిపై వివరణ ఇచ్చుకున్నాడు కోహ్లీ. వరుసగా వికెట్లు కోల్పోవడం, రన్ రేట్ పెరిగిపోతుండటం వల్ల ధోనీని బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి జరపాల్సి వచ్చిందని అన్నాడు. రిషబ్ పంత్కు తోడుగా హార్దిక్ పాండ్యను పంపించడం వల్ల ఇద్దరూ నిలదొక్కుకుని భారీ షాట్లను ఆడతారని తాము ఆశించామని చెప్పాడు. భారీ షాట్లను ఆడే ప్రయత్నంలోనే వారిద్దరూ అవుట్ అయ్యారు. అప్పటికే అటు రిషబ్ పంత్ గానీ, ఇటు హార్దిక్ పాండ్యా గానీ తమ స్థాయికి మించి డాట్ బాల్స్ ఆడటంతో పరిస్థితి సున్నితంగా మారిందని కోహ్లీ వివరణ ఇచ్చుకున్నాడు.