
హైదరాబాద్: భారత్ లో క్రికెట్ కు ఉండే అభిమానులు మరే క్రీడకు ఉండరు. అందులోనూ కెప్టెన్ విరాట్ అంటే మహాభిమానం ఉండే వాళ్లు కోకొల్లలు. అతను ఏం చేసినా స్టైల్, కొత్త హేయిర్ కట్ చేయించినా, వైవిధ్యమైన టాటూ వేయించినా, కొత్త కార్లో చక్కర్లు కొట్టినా..ఇలా ఏది చేసినా దానిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటూ అభిమానులకు చేరువగా ఉంటాడు.
అదేవిధంగా మ్యాచ్ అనంతరం కూడా వారితో సెల్ఫీలు దిగుతూ కనిపిస్తుంటాడు. అలాంటి కోహ్లి కొన్ని సందర్భాలలో అభిమానుల తీరు పట్ల ఇబ్బంది పడినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఇతర దేశాలలో అభిమానులు మమ్మల్ని దూరం నుంచి చూస్తారు. బాగా ఆడితే అభినందిస్తారు. అనంతరం వారి పనిలో నిమగ్నమవుతుంటారు. అయితే ఇక్కడ అలా కాదు. నా పట్ల వారు చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. అయితే వారి భావాలను నేను అర్థం చేసుకోగలను. కానీ దానికో పరిమితి ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఓ సాధారణ వ్యక్తినే. ఒక్కోసారి వాటి మూలంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీని వల్ల వారు చూపించే అభిమానాన్ని మాత్రం స్వీకరించలేకపోతున్నట్లు కోహ్లి అన్నాడు.
అభిమానులు చూపించే ప్రేమ, అభిమానానికి కొన్నిసార్లు కనెక్ట్ కాలేకపోయినట్లు తెలిపాడు. క్రికెటర్లకు కొన్ని పరిమితులుంటాయి..వాటిని దాటకూడదంటూ కొందరు చెప్తుంటారు. అయితే వారి విషయంలోనూ ఇది వర్తిస్తుందని మర్చిపోవద్దు. ముఖ్యంగా ఓ రెండు సందర్భాలలో అభిమానుల తీరుతో బాగా ఇబ్బంది పడినట్లు' కోహ్లి చెప్పుకొచ్చాడు.
తొలిసారిగా అభిమానులు చూపించే ప్రేమ ఏవిధంగా ఉంటుందో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రిటెర్మెంట్ రోజున చూశాను. అనుకోకుండా ఆ రోజు బస్సు ముందు సీటులో నేను కూర్చున్నాను. బస్సు స్టేడియం దాటి వెళ్తుండగా అభిమానులు కొందరు ఒక్కసారిగా బస్సుకు అడ్డంగా పడుకున్నారు. సచిన్ రిటైర్ కానని చెప్పేంతవరకూ బస్సును ముందుకు కదలనివ్వమంటూ..వారు భావోద్వేగంతో పేర్కొన్నట్లు కోహ్లి చెప్పాడు.