విరాట్ కోహ్లీ.. ఈ పేరు వింటే రికార్డులు వణికిపోతాయి. ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్లోనే సన్రైజర్స్ హైదరాబాద్పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ విమర్శకుల నోళ్లు మూయించింది. విరాట్ కోహ్లీ కేవలం 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 69 పరుగులు చేసి ఆర్సీబీకి ఘన విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది.
కైఫ్ చేసిన పోస్ట్ ఏంటి?
విరాట్ కోహ్లీపై గతంలో వచ్చిన విమర్శలను గుర్తు చేస్తూ మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కింగ్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. "ఒకసారి ఆలోచించండి.. ఆస్ట్రేలియా పర్యటనలో రెండుసార్లు సున్నాకే ఔట్ అయినప్పుడు.. కోహ్లీ పని అయిపోయిందని చాలా మంది అన్నారు. కానీ వైట్-బాల్ క్రికెట్లో విరాట్ కోహ్లీ గత 10 ఇన్నింగ్స్ల స్కోర్లు చూడండి: 74, 135, 102, 65, 131, 77, 93, 23, 124, తాజా మ్యాచ్లో 69 నాటౌట్. కోహ్లీ ఇంకా తన జోరును కొనసాగిస్తూనే ఉన్నాడు" అని మహమ్మద్ కైఫ్ రాసుకొచ్చాడు.

అభిమానుల మధ్య మొదలైన యుద్ధం
మహమ్మద్ కైఫ్ విరాట్ కోహ్లీని ప్రశంసిస్తూనే ఈ పోస్ట్ చేసినప్పటికీ.. కొంత మంది ఫ్యాన్స్ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఇప్పుడు కెరీర్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడని.. ఆయనకు ఇప్పుడు ఎవరి సమర్థన అవసరం లేదని అభిమానులు వాదిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ.. విరాట్ కోహ్లీపై విమర్శలు కేవలం టెస్ట్ క్రికెట్లో ఆయన ఫామ్ గురించి మాత్రమే వచ్చాయని.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో (ODI, T20) కోహ్లీ ఎప్పుడూ రారాజేనని గుర్తు చేస్తున్నారు.
చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ
ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ పలు అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో లక్ష్య ఛేదనలో 4000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ను కోహ్లీ అధిగమించాడు. ఐపీఎల్లో ఇది కోహ్లీకి 64వ అర్ధశతకం కావడం విశేషం.
రాకెట్ వేగంతో ఆర్సీబీ విజయం
202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ కోహ్లీతో పాటు దేవదత్ పడిక్కల్ కూడా మెరుపు దాడి చేయడంతో మరో 26 బంతులు మిగిలి ఉండగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ భారీ విజయం వల్ల టోర్నీ ఆరంభంలోనే ఆర్సీబీ నెట్ రన్ రేట్ అద్భుతంగా మెరుగైంది. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ఐపీఎల్లో మాత్రం విరాట్ కోహ్లీ తన హవా ఇంకా తగ్గలేదని చాటిచెప్పాడు.