
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. కోల్కతాలోని ఈడెన్గార్డెన్స్లో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీకి ఇది 50వ సెంచరీ కాగా, టెస్టుల్లో 18వ సెంచరీ.
119 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. అంతేకాదు ఈ సెంచరీకి ఎంతో ప్రత్యేకతం ఉంది. విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్లో ఈడెన్లో చేసిన తొలి సెంచరీ ఇది. ఇన్నింగ్స్ 88.4వ బంతిని సిక్స్గా మలిచి కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు.
ఈ సెంచరీతో విరాట్ కోహ్లీ అరుదైన క్లబ్లో చేరాడు. వన్డేల్లో 32 సెంచరీలు చేసిన కోహ్లీకి.. టెస్టుల్లో ఇది 18వ సెంచరీ. సచిన్ టెండూల్కర్ (100 సెంచరీలు) తర్వాత క్రికెట్లో 50 అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన రెండో క్రికెటర్ భారత క్రికెటర్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
పాంటింగ్ (71), సంగక్కర (63), కలిస్ (62), ఆమ్లా (54), జయవర్దనె (54), లారా (53) అంతర్జాతీయ క్రికెట్లో 50కిపైగా సెంచరీలు చేశారు. అయితే, తాజా సెంచరీతో విరాట్ కోహ్లీ భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. కెప్టెన్గా గవాస్కర్ టెస్టుల్లో 11 సెంచరీలు సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇప్పుడు ఆ రికార్డును కోహ్లీ సమం చేశాడు. 2014లో ధోనీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న కోహ్లీ టెస్టుల్లో ఇప్పటి వరకు 11 సెంచరీలు చేశాడు. దీంతో కెప్టెన్గా అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో సునీల్ గవాస్కర్తో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో అజారుద్దీన్(9), సచిన్ టెండూల్కర్(7), ధోనీ, గంగూలీ, పటౌడీ(5), రాహుల్ ద్రవిడ్(4)లు ఉన్నారు.
కెప్టెన్గా టెస్టుల్లో ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్లు:
1. విరాట్ కోహ్లీ/సునీల్ గవాస్కర్: 11
2. మహ్మద్ అజహరుద్దీన్: 9
3. సచిన్ టెండూల్కర్: 7
4. ధోని/గంగూలీ/పటౌడి: 5
5. రాహుల్ ద్రవిడ్: 4