57వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్:
మూడో వన్డేలో 'చేజింగ్ కింగ్' టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (81 బంతుల్లో 85; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో అద్భుతంగా రాణించాడు. రవీంద్ర జడేజాతో కలిసి టీమిండియా విజయానికి కావాల్సిన విలువైన పరుగులు జోడించి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'కు ఎంపికయ్యాడు. ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీకి 57వది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్న క్రికెటర్ల జాబితాలో దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వస్ కలిస్ (57)తో సమంగా నిలిచాడు.
కలిస్తో సమంగా:
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్న జాబితాలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (76 సార్లు) అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక మాజీ ఓపెనర్ జయసూర్య (58 సార్లు) రెండో స్థానంలో ఉండగా.. కోహ్లీ-కలిస్లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. కోహ్లీ ప్రస్తుత ఫామ్ చూస్తే.. జయసూర్యను కూడా అతి త్వరలోనే అధిగమించనున్నాడు.
కలిస్ను అధిగమించిన కోహ్లీ:
కటక్ వన్డేలో 85 పరుగులు చేసే క్రమంలో కోహ్లీ మరో ఘనత అందుకున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కలిస్ (11,579)ను అధిగమించాడు. కోహ్లీ 11,609 పరుగులతో ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ (18,426), కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్ (13,704), జయసూర్య (13,430), మహేల జయవర్ధనే (12,650), ఇంజమాముల్ హక్ (11,739)లు వరుసగా ఉన్నారు. దాదాపు మరో 2,500 పరుగులు కోహ్లీ చేస్తే.. సచిన్ను తప్ప మిగతావారందరిని అధిగమిస్తాడు.
వరుసగా నాలుగో ఏడాది:
కోహ్లీ ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో కలిపి 2,455 పరుగులు చేసాడు. దీంతో కూడా మరో అరుదైన రికార్డును సాధించాడు. వరుసగా నాలుగేళ్లు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2016లో 2,595 పరుగులు.. 2017లో 2,818 పరుగులు.. 2018లో 2,735 పరుగులు బాదాడు.