హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి వెస్టిండిస్ ఓపెనర్, రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ అరుదైన బహుమతిని అందుకున్నాడు. క్రిస్ గేల్ ఫౌండేషన్ కోసం విరాట్ కోహ్లీ తన అత్యంత ఇష్టమైన బ్యాట్ను విరాళంగా ఇచ్చాడు. వేలానికి అందుబాటులో ఉన్న బ్యాట్ తన ఫేవరేట్ బ్యాట్లలో ఒకటని కోహ్లీ పేర్కొన్నాడు.
ఈ మేరకు క్రిస్ గేల్ ఫౌండేషన్కు చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతాలో విరాట్ కోహ్లీ బ్యాట్కు సంబంధించిన వీడియోని ట్వీట్ చేసింది. చారిటీలో భాగంగా ఈ బ్యాట్ని వేలం వేసేందుకు విరాట్ కోహ్లీ ఇచ్చినట్లు అందులో పేర్కొంది. క్రికెట్లో యువతకు మెరుగైన శిక్షణ, అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో 'క్రిస్గేల్ ఫౌండేషన్' పేరుతో గేల్ ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నాడు.
'ఈ బ్యాట్ నా పర్సనల్ ఫేవరేట్ బ్యాట్లలో ఒకటి. ఈ బ్యాట్తో ఆడటాన్ని ఎప్పుడూ ఇష్టపడతాను. బెస్ట్ విషెస్' అంటూ కోహ్లీ తన సంతకాన్ని చేశాడు. జూన్ 6 (మంగళవారం)న లండన్లో 'ద క్రిస్ గేల్ డిన్నర్' లో ఈ బ్యాట్ని వేలానికి తీసుకురానున్నారు. కోహ్లీ అందించిన బ్యాట్తో పాటు సీజీ పేరుతో 10000 అంకెగల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీని కూడా వేలానికి అందుబాటులో ఉంచారు.
ఈ కార్యక్రమానికి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్, టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సైతం హాజరుకానున్నారు. 'ద క్రిస్ గేల్ ఫౌండేషన్' ఫండ్ రైజింగ్ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే జూన్ 1 నంచి 18 వరకు ఇంగ్లాండ్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే సమయంలోనే క్రిస్ గేల్ ఇలా వేలం నిర్వహించడం కాకతాళీయంగా జరిగిందని ద క్రిస్ గేల్ ఫౌండేషన్ నిర్వహకులు తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. అంతేకాదు వీరిద్దరూ కలిసి ఐపీఎల్లో ఎన్నో రికార్డులను నెలకొల్పారు. అయితే ఐపీఎల్ పదో సీజన్లో ఆర్సీబీ అత్యంత చెత్త ప్రదర్శనను కనబర్చింది. ఈ సీజన్లో 14 మ్యాచ్లాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం మూడు మ్యాచ్ల్లోనే విజయం సాధించింది.