న్యూఢిల్లీ/అంటిగ్వా: భారతదేశంలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రజనీకాంత్ తాజా చిత్రం కబాలితో భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఢీకొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం కబాలి విడుదలవగా.. గురువారం రాత్రి నుంచే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున అభిమానుల మధ్య చర్చ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ అజేయ శతకం బాదడంతో చర్చ కాస్తా రెండు అంశాలపైకి మళ్లింది. దీంతో విరాట్ కోహ్లీని కబాలితో పోలుస్తూ కొంత మంది 'విరాట్ కబాలి' మరో శతకం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
మరికొందరైత.. కబాలి చిత్రం విడుదలైంది కానీ.. విండీస్ను మాత్రం కోహ్లీ ఇంకా విడిచిపెట్టడం లేదంటూ సరదా జోకులు పేల్చారు. వెస్టిండీస్ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 3గంటల వరకు టెస్టు మ్యాచ్ తొలి రోజు కొనసాగింది. దీంతో మ్యాచ్ను ఉదయం వరకు చూసిన అభిమానులు అటు నుంచి నేరుగా థియేటర్కు వెళ్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో రాశారు.

మొత్తానికి భారత్కు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లు అభిమానులకు నిద్రలేని రాత్రిని చేశారంటూ కొంతమంది ట్విట్టర్లోనే సెటైర్లు వేయడం కొసమెరుపు. అంతేగాక, శుక్రవారం కూడా కబాలి సినిమాతోపాటు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చూడాల్సిందేనని మరికొందరు అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం 143 పరుగులతో క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ.. తన తొలి డబులు సెంచరీ నమోదు చేసే అవకాశం కూడా లేకపోలేదు.
ఇది ఇలా ఉంటే.. తాను విరాట్ కోహ్లీ ట్రిపుల్ సెంచరీని కోరుకుంటున్నానని సహచర ఆటగాడు శిఖర్ ధావన్ ప్రకటించడం గమనార్హం. టెస్టుల్లో 12 శతకాలు బాదిన విరాట్ కోహ్లీ.. 3వేల పరుగులు దాటిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. గురువారం తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ఆట ముగిసే సమయానికి భారత్ 302/4తో ఆటను కొనసాగిస్తోంది.