Virat Kohli Records: ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్పై సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ చెప్పుకోదగ్గ రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ 241 పరుగులు చేయగా.. భారత్ 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 111 బంతుల్లో 100 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు. చాలా కాలం తర్వాత విరాట్ కోహ్లీ వన్డేల్లో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. వన్డేల్లో విరాట్ కోహ్లీకి ఇది 42వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. టీమిండియా తరఫున అత్యధిక వన్డే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. అగ్రస్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ 62 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. కోహ్లీ 42 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.
మరో అరుదైన రికార్డు..
విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐసీసీ ఈవెంట్లలో ఒకే జట్టుపై అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ పాకిస్థాన్ పై ఐదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకోవడం గమనార్హం. విరాట్ కోహ్లీ 2012 టీ20 వరల్డ్ కప్ లో, 2015 వన్డే వరల్డ్ కప్ లో, 2016 టీ20 వరల్డ్ కప్ లో, 2020 టీ20 వరల్డ్ కప్ లో, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది జట్టుపై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. మరే ఇతర ఆటగాడు ప్రత్యర్థి జట్టుపై మూడు కంటే ఎక్కువ అవార్డులు సాధించకపోవడం గమనార్హం.

ఏకైక ఆటగాడిగా..
ఇదిలా ఉండగా..ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ అనే మూడు వేర్వేరు వన్డే సిరీస్ లలో పాకిస్థాన్ పై సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇంతవరకు మరే ఇతర ఆటగాడు ఈ ఘనతను సాధించలేదు.
అత్యధిక సెంచరీలు..
అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేయడానికి విరాట్ కోహ్లీ ఇప్పుడు దగ్గరగా ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ 782 ఇన్నింగ్స్ లలో 100 సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం 614 ఇన్నింగ్స్ లలో 82 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. మరో వైపు అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ82 సెంచరీలతో అగ్రస్థానంలో, జో రూట్ 52 సెంచరీలతో రెండో స్థానంలో, రోహిత్ శర్మ 49 సెంచరీలతో మూడో స్థానంలో, స్టీవ్ స్మిత్ 48 సెంచరీలతో నాలుగో స్థానంలో, కేన్ విలియమ్సన్ 47 సెంచరీలతో ఐదో స్థానంలో ఉన్నారు.
అత్యధిక అర్థ శతకాలు..
ఐసీసీ నిర్వహించిన వన్డే సిరీస్ లలో అత్యధికంగా అర్థ శతకాలు(50+) చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ తో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. వారిద్దరూ ఐసీసీ వన్డే సిరీస్ లలో 23 సార్లు 50+ పరుగులు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ లో పాకిస్థాన్ పై అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా విరాట్ కోహ్లీ పేరిట ఉంది. అంతకు ముందు శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ లోని పాకిస్థాన్ పై 188 పరుగులు చేశాడు. ఆ రికార్డును ఇప్పుడు విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.
అత్యధిక పరుగులు..
ఇది మాత్రమే కాకుండా.. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 14,000 పరుగుల మైలురాయిని కూడా సాధించాడు. అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే వన్డే ఇంటర్నేషనల్స్ లో 14 వేల కంటే ఎక్కువ పరుగులు సాధించారు. సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులు చేయగా.. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర 14,234 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం 14,085 పరుగులు సాధించాడు.కోహ్లీ త్వరలోనే సంగక్కర రికార్డును బద్ధలు కొట్టే అవకాశం ఉంది.
Instagram story of Siraj, Arshdeep, Varun for King Kohli 🐐
— Johns. (@CricCrazyJohns) February 24, 2025
- ONE & ONLY GOAT IN ODIs...!!!! pic.twitter.com/XB5QjlgIkB
అత్యధిక క్యాచ్ లు
అంతర్జాతీయ వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్ లు పట్టిన క్రికెటర్ గానూ విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు వన్డేల్లో విరాట్ కోహ్లీ 158 క్యాచ్ లు పట్టాడు. ఈ క్రమంలో మహ్మద్ అజారుద్దీన్(156) రికార్డును కోహ్లీ అధిగమించాడు. ఓవరాల్ గా వన్డేల్లో అత్యధిక క్యాచ్ లు పట్టిన మూడో క్రికెటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంక క్రికెటర్ మహేల జయవర్ధనే(218) ఉండగా.. రెండో స్థానంలో రికీ పాంటింగ్ (160) ఉన్నాడు.