డబ్ల్యూటీసీ ఓటమి తర్వాత భారత ఆటగాళ్లకు నెలరోజుల విశ్రాంతి దొరికింది. ఆఫ్ఘనిస్తాన్తో అనుకున్న సిరీస్.. సమయానికి కుదర్లేదు. దీంతో వారు జులైలో జరిగే వెస్టిండీస్ సిరీస్తో మళ్లీ మైదానంలో దిగనున్నారు. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు అందరూ తమ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఇషాన్ కిషన్ వంటి కుర్రాళ్లయితే దేశవాళీలు కూడా ఆడకుండా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో కూడా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సెలవుల్లో కూడా తన ఫిట్నెస్ తగ్గకుండా జిమ్ వర్కవుట్స్ చేస్తూనే ఉన్నాడు. ఇలా తను జిమ్లో చెమటోడుస్తున్న వీడియోను కోహ్లీ తన ఇన్స్టాగ్రాంలో షేర్ చేశాడు. 'సాకులు వెతుక్కో లేదంటే మెరుగవడానికి ప్రయత్నించు' అనే క్యాప్షన్తో ఈ వీడియోను పంచుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అతని మోటివేషన్ చూసి చాలా సంతోషిస్తున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీ పెద్దగా ఆకట్టుకోలేదు. తొలి ఇన్నింగ్సులో మిచెల్ స్టార్క్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అవడంతో దాన్ని డిఫెండ్ చేసుకోలేక అవుటయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 49 పరుగుల వద్ద బోలాండ్ వేసిన బంతిని కవర్ డ్రైవ్ ఆడబోయి స్లిప్స్లో ఉన్న స్టీవెన్ స్మిత్కు క్యాచ్ ఇచ్చాడు. మూడేళ్లుగా ఫామ్లేక తంటాలు పడిన కోహ్లీ మళ్లీ ఇప్పుడిప్పుడే ఫామ్ అందుకుంటున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో ఒక విధంగా కోహ్లీ తన పూర్వపు ఫామ్ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఐపీఎల్లో తను ఆడిన చివరి రెండు మ్యాచుల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కూడా బాదాడు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్లో అదే జోరు కొనసాగించలేకపోయాడు. ఈ క్రమంలో వెస్టిండీస్తో ఆడే సిరీస్లో కొన్ని మ్యాచులకు రోహిత్, కోహ్లీ తదితర సీనియర్లకు విశ్రాంతి ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టీ20ల్లో కూడా సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లీకి ఈ సిరీస్లో విశ్రాంతి ఇస్తారేమో చూడాలి. రోహిత్ అయిత కచ్చితంగా టెస్టులు కానీ, వైట్ బాల్ సిరీస్లో కానీ విశ్రాంతి తీసుకుంటాడని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. అతను బాగా అలిసిపోయినట్లు కనిపిస్తున్నాడని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మాత్రం వేచి చూడక తప్పదు.