
హైదరాబాద్: వన్డే సిరిస్ ముగిసింది. ఆరు వన్డేల సిరిస్ను 5-1తో కైవసం చేసుకుని కోహ్లీసేన మంచి ఊపు మీదుంది. మూడు టీ20ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య జోహెన్స్బర్గ్ వేదికగా తొలి టీ20 సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఈ టీ20 సిరిస్కు భారత్ సర్వం సిద్ధమైంది.
ఈ తొలి టీ20 టీమిండియాకు ఎంతో ప్రత్యేకమైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్లో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నారు. ఈ మ్యాచ్లో కోహ్లీ 44 పరుగులు సాధిస్తే టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని అందుకున్న మూడో క్రికెటర్గా అరుదైన ఘనత సాధిస్తాడు.
ఇప్పటివరకు 51 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ కోహ్లీ 52.86 యావరేజితో 1956 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీకి కంటే ముందు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్(2188), న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్ (2250) మాత్రమే ఉన్నారు.
ఇక, ధోని విషయానికి వస్తే... ఈ మ్యాచ్లో మరో మూడు క్యాచ్లు అందుకుంటే టీ20ల్లో 50 క్యాచ్లు అందుకున్న రెండో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో ధోని కంటే ముందు దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్(65 క్యాచ్లతో) ముందు ఉన్నాడు.

ఇదే సఫారీ గడ్డపై ధోని నేతృత్వంలోని టీమిండియా తొలి టీ20 వరల్డ్ కప్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ ఇప్పటి వరకు పది టీ20 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఏడుసార్లు విజయం సాధించింది.