వన్డే సిరిస్ గెలిచిన తర్వాత ప్రయోగాలు చేసి ఉంటే బాగుండేది
ఐదు వన్డేల సిరీస్ గెలిచిన తర్వాత ప్రయోగాలు చేసి ఉంటే బాగుండేదని, ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడం, కోహ్లి అనాలోచిత నిర్ణయాలతో సిరీస్ చేజారిందని గవాస్కర్ తీవ్రంగా విమర్శించాడు. ఐదు వన్డేల సిరిస్లో తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన కోహ్లీసేన ఆ తర్వాతి మూడు వన్డేల్లో వరుసగా ఓడిపోయింది.
రిజర్వ్ బెంచ్ని పరీక్షించుకోవడం ముఖ్యమే
దీంతో ఈ సిరిస్లో మరో మ్యాచ్ గెలిచాక ప్రయోగాలు చేస్తే బాగుండేందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. వరల్డ్కప్ ముంగిట జట్టు రిజర్వ్ బెంచ్ని పరీక్షించుకోవడం ముఖ్యమే అయినప్పటికీ... ఈ సిరీస్లో విజేతగా నిలవడం అంతకన్నా ముఖ్యమని గవాస్కర్ అభిప్రాపయపడ్డాడు. ఈ సిరిస్ గెలిచి ఉంటే జట్టు మరింత ఆత్మవిశ్వాసంతో వరల్డ్కప్ బరిలో నిలిచేదని గవాస్కర్ అన్నాడు.
237 పరుగులు చేసి ఆలౌటైన భారత్
ఆస్ట్రేలియా నిర్దేశించిన 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 237 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాతో బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు వన్డేల సిరిస్ను ఆస్ట్రేలియా 3-2తేడాతో కైవసం చేసుకుంది.
ధోనీకి విశ్రాంతినివ్వడం
చివరి రెండు వన్డేల్లో వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి విశ్రాంతినివ్వడం... మరోవైపు సీనియర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడిపై వేటు వేయడం భారత విజయవకాశాలను దెబ్బతీశాయి. ధోని స్థానంలో చివరి రెండు వన్డేల్లో చోటు దక్కించుకున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన తప్పిదాలకు నాలుగో వన్డేలో భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది.
కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలం
ఇక, మూడో ఓపెనర్గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆఖరి వన్డేలోనూ అదనపు బ్యాట్స్మెన్గా ఉన్న కేఎల్ రాహుల్ని తప్పించి మరీ ఒక బౌలర్ని తీసుకోవడంతో ఛేదనలో భారత్కి ఇబ్బందిగా మారింది. దీంతో భారత్ చేజేతులా వన్డే సిరీస్ను చేజార్చుకుంది. ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి వన్డే వరల్డ్కప్ ప్రారంభం కానుంది.