
లండన్: ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్పై నమోదు చేసిన తొలి విజయాన్ని కేరళ వరద బాధితులకు కోహ్లీసేన అంకితమిచ్చింది. నాటింగ్హామ్ వేదికగా బుధవారం ముగిసిన మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్పై టీమిండియా 203 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ నమోదు చేసిన కెప్టెన్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "ఈ విజయాన్ని ఒక జట్టుగా మేము కేరళ వరద బాధితులకి అంకితమిస్తున్నాం" అని ప్రకటించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 97 పరుగుల వద్ద ఔటైన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్లో 103 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.
"ఈ టెస్టు మ్యాచ్కి ముందు చాలా కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాం. సిరీస్లో భారత్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్లో విజయం సాధించడం భారత్కి చాలా ముఖ్యం. జట్టులోని ఆటగాళ్లు కూడా అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. స్కోరు బోర్డుపై ఎక్కువ పరుగులు ఉంచడం ద్వారా ఇంగ్లాండ్పై ఆధిపత్యం చెలాయించగలిగాం" అని కోహ్లీ తెలిపాడు.
"తొలి ఇన్నింగ్స్లో రహానే, రెండో ఇన్నింగ్స్లో పుజారా నాతో కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం ఈ మ్యాచ్లో కీలక మలుపు. బోర్డుపై ఎక్కువ పరుగులు ఉండటంతో.. బౌలర్లు కూడా స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలిగారు. 2014 వైఫల్యాల గురించి నేను ఏమీ ఆలోచించడం లేదు. ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ను నా భార్య అనుష్క శర్మకి అంకితమిస్తున్నా. ఆమె ఇక్కడే ఉండి నన్ను ప్రోత్సహిస్తోంది" అని కోహ్లీ అన్నాడు.
ఓవర్ నైట్ స్కోరు 311/9తో చివరిరోజు ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో ఆరు పరుగులు మాత్రమే జోడించి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ జేమ్స్ ఆండర్సన్ (11) పరుగుల వద్ద రహానేకు క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది.
జోస్ బట్లర్ (106) సెంచరీ, స్టోక్స్ (62) హాఫ్ సెంచరీ చేసినా.. ఇంగ్లండ్ను గట్టెక్కించలేకపోయారు. రెండో ఇన్నింగ్స్లో సెంచరీ నమోదు చేసిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకి దక్కింది. భారత బౌలర్లలో బుమ్రా ఐదు, ఇషాంత్ శర్మ 2, అశ్విన్, షమీ, పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు.
ఇన్నింగ్స్ వివరాలు:
తొలి ఇన్నింగ్స్:
ఇండియా: 329
ఇంగ్లాండ్: 161
రెండో ఇన్నింగ్స్:
ఇండియా: 352/7 డిక్లేర్
ఇంగ్లాండ్: 317