టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ మరోసారి తన ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. ఆసియా కప్కు ముందు టీమిండియా ఆటగాళ్లు అందరికీ ప్రిపరేటరీ క్యాంప్ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్లేయర్లు అందరికీ ఫిట్నెస్ టెస్టులు కూడా నిర్వహించింది. వీటిలో ఫిట్నెస్ స్టాండర్డ్ అందుకోలేని ప్లేయర్లను గుర్తిస్తామని తెలిపింది.
దీని కోసం బెంగళూరు చేరుకున్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ.. తన యో యో టెస్టు కూడా ముగించాడు. ఈ టెస్టులో ఏకంగా 17.2 పాయింట్లు సాధించాడు. ఈ విషయాన్ని కోహ్లీనే స్వయంగా ప్రకటించడం గమనార్హం. 'కోన్స్ మధ్య యో యో టెస్టు ముగించిన ఆనందం. 17.2 డన్' అని తన ఇన్స్టా స్టోరీలో కోహ్లీ పోస్టు చేశాడు.

గతేడాది పొట్టి ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్లో కోహ్లీ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున ఈ టోర్నీలో టాప్ స్కోరర్గా నిలిచాడీ స్టార్ క్రికెటర్. మళ్లీ ఇప్పుడు వరల్డ్ కప్కు ముందు ఆసియా కప్ ఆడేందుకు రెడీ అవుతున్నాడు. వరల్డ్ కప్కు సన్నాహకంగా జరుగుతున్న ఈ టోర్నీలో రాణించడం చాలా అవసరం.
ఎన్సీయేలో ప్రిపరేటరీ క్యాంప్ ముగిసిన తర్వాత టీమిండియా ప్లేయర్లు అందరూ ఆసియా కప్ కోసం శ్రీలంక బయలు దేరతారు. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచులకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అందుకే అందరూ అక్కడకు బయలు దేరతారు. ఇక ఇటీవల గాయం నుంచి కోలుకున్న అయ్యర్, మరోసారి గాయపడిన కేఎల్ రాహుల్ విషయంలోనే ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడుతున్నారు.
వీళ్లిద్దరూ పూర్తి ఫిట్నెస్ సాధిస్తారా? లేదంటే వీరి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అని అభిమానుల మధ్య తెగ చర్చ జరుగుతోంది. అలాగే కోహ్లీతోపాటు రోహిత్ కూడా బెంగళూరు క్యాంపులో ఉన్నాడు. అతని యో యో టెస్టు ఎలా ముగిసిందని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు.