2014లో టెస్టు కెప్టెన్సీ
విరాట్ కోహ్లీ తొలిసారిగా 2014లో టీమిండియా టెస్టు కెప్టెన్సీ చేపట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్కు బొటన వేలు గాయంతో అప్పటి కెప్టెన్ ధోని దూరమయ్యాడు. దీంతో తొలి సారి ఆ మ్యాచ్లో టీమిండియాను కోహ్లీ నడిపించాడు. అనంతరం రెండు, మూడు టెస్టులకు ధోని నాయకత్వం వహించాడు. అయితే మూడో టెస్టు మ్యాచ్ అనంతరం ధోని టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. దీంతో నాలుగో టెస్టు మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీని బీసీసీఐ టీమిండియా శాశ్వత టెస్టు కెప్టెన్గా ప్రకటించింది.
ధోని రిటైర్మెంట్తో ఏడ్చేశా
2015లో ఓ క్రీడా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వూలో ధోని టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన తర్వాత తాను కన్నీళ్లు పెట్టుకున్నానని విరాట్ కోహ్లీ తెలిపాడు. భావోద్వేగంతో ఏడ్చేశానని చెప్పాడు. ధోని నిర్ణయంతో ఆ రోజు నుంచి షాక్కు గురయ్యానని తెలిపాడు. తాను అప్పుడు కెప్టెన్ అవుతానని అనుకోలేదని చెప్పుకొచ్చాడు. "ఆ విషయం తెలిశాక, కాస్త సద్దుమణిగిన తర్వాత నేను నా రూమ్లోకి వెళ్లాను.
అక్కడే ఉన్న అనుష్క శర్మతో ఈ విషయం చెప్పాను. ఇది ఇంత హఠాత్తుగా ఎలా జరిగిందనే హవభావాలు తనలో వ్యక్తమయ్యాయి. ధోని ఇలా ఎందుకు చేశాడని ప్రశ్నించింది." అని కోహ్లీ తెలిపాడు.
భావోద్వేగానికి గురి చేసింది
ఇక నుంచి ఒకటి, రెండు మ్యాచ్లకు కాకుండా టెస్టు కెప్టెన్గా శాశ్వతంగా ఉంటానన్న వాస్తవాన్ని గుర్తించడం తనను భావోద్వేగానికి గురి చేసిందని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఇలా జరుగుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని చెప్పుకొచ్చాడు. తాను క్రికెట్ ఆడడం ప్రారంభించినప్పుడు టీమిండియాకు టెస్టు క్రికెట్లో ప్రాతినిధ్యం వహించడమే తన కల అని గుర్తు చేసుకున్నాడు.
తాను ఒక చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు క్లబ్ క్రికెట్, స్కూల్ క్రికెట్, రాష్ట్ర క్రికెట్ ఆడిన రోజులను గుర్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి మొదలు పెట్టి 26 ఏళ్ల వయసులో తాను టీమిండియాకు కెప్టెన్ అయ్యానని చెప్పుకొచ్చాడు. 26 వయసులో తాను టీమిండియాకు కెప్టెన్ అవుతానని ఊహించలేదని కోహ్లీ తెలిపాడు.
బెస్టు కెప్టెన్గా కోహ్లీ
అలా టెస్టు కెప్టెన్సీ చేపట్టిన కోహ్లీ టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా నిలిచాడు. మొత్తం 68 టెస్టు మ్యాచ్ల్లో నాయకత్వం వహించి రికార్డు స్థాయిలో 40 మ్యాచ్ల్లో గెలిపించాడు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఒక్క స్వదేశీ సిరీస్ కూడా ఓడిపోకపోవడం గమనార్హం.