Virat Kohli: దాదాపు 17 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంఏ చిదంబరం(చెపాక్) స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. 2008 తర్వాత ఆర్సీబీ ఈ ఘనతను సాధించింది. మార్చి 28న జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. చెపాక్ స్టేడియంలో విరాట్ చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడాడు. అయినప్పటికీ విరాట్ తన పేరు మీద కీలక రికార్డును సృష్టించాడు.
చెన్నైపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మార్చి 28న చెపాక్ స్టేడియంలో సీఎస్కేతో జరిగిన ఆర్సీబీ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఈ రికార్డును సాధించాడు. ఈ విషయంలో భారత మాజీ క్రికెట్ శిఖర్ ధావన్ ను అధిగమించాడు. ఈ కీలక మ్యాచ్కు ముందు సీఎస్కేపై 1057 పరుగులు చేసి శిఖర్ ధావన్ కంటే విరాట్ కోహ్లీ కేవలం నాలుగు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ శిఖర్ ధావన్ను అధిగమించాడు. విరాట్ కోహ్లీ సీఎస్కేపై 1083 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు చెన్నైపై ఎవరూ ఇన్ని పరుగులు చేయలేదు.

ఈ ప్రత్యేక జాబితాలో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్లతో పాటు భారత కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సీఎస్కేపై 896 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ తర్వాత డేవిడ్ వార్నర్ 696 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా.. వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్మన్ కీరన్ పొలార్డ్ 583 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. టాప్ సిక్స్లో చివరి పేరు కేఎల్ రాహుల్.. అతను సీఎస్కేపై 553 పరుగులు చేశాడు.
సీఎస్కేపై 50 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం
కెప్టెన్ రజత్ పాటిదార్ అర్థ సెంచరీ, క్రమశిక్షణ బౌలింగ్ ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చెన్నై సూపర్ కింగ్స్ కంచుకోట అయిన చెపాక్లో ఓడించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో సీఎస్కేపై విజయం సాధించింది. ఆర్సీబీ ఏడు వికెట్లకు 196 పరుగులు చేయగా.. ఐదుసార్లు ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.