Virat Kohli: భారత దిగ్గట బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత్ గురించి తరచుగా చెడుగా మాట్లాడే పాకిస్తాన్ లాంటి దేశంలో కూడా విరాట్ కోహ్లీకి అభిమానులు ఉన్నారు. ఇండియాలో జరుగుతున్న ఐపీఎల్ 2025 లాగానే.. పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL) 2025 పొరుగుదేశమైన పాకిస్తాన్లో ప్రస్తుతం జరుగుతోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగంగా సోమవారం రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మి జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. అక్కడ విరాట్ కోహ్లీ క్రేజ్ కనిపించింది.
ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అభిమాని కూడా కనిపించాడు. ఆ అభిమాని ధరించిన జెర్సీపై విరాట్ కోహ్లీ ఐకానిక్ నంబర్ 18 అని రాసి ఉంది. ఈ అభిమాని ఫోటో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ మ్యాచ్లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు పెషావర్ను 102 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సీజన్లో పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అభిమాని కనిపించడం ఇదే మొదటిసారి కాదు.

పాకిస్తాన్లో విరాట్కు అభిమానులు ఎక్కువే..
శనివారం ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు కరాచీలోని నేషనల్ స్టేడియం వెలుపల ఉన్న ఒక అభిమాని ఫోటో వైరల్ అయింది. అందులో ఆ వ్యక్తి విరాట్ కోహ్లీ పేరు, జెర్సీ నంబర్ 18 ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీని ధరించి కనిపించాడు.
విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. ప్రతిసారీ లాగే ఈ సీజన్ లో కూడా విరాట్ కోహ్లీ బ్యాట్ నిప్పులు చెరుగుతోంది. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 6 మ్యాచ్ ల్లో 62 సగటుతో, 143 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 248 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ జట్టు విషయానికొస్తే ఆర్సీబీ 6 మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ సీజన్లో జట్టు అద్భుతమైన ప్రదర్శనకు విరాట్ కోహ్లీ ఫామ్ కూడా ఒక కారణం.