టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్లో తిరిగి రావడానికి అంగీకరించాడు. రాబోయే విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టు తరఫున ఆడటానికి తన సంసిద్ధతను 'ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)'కు తెలియజేశాడు. విరాట్ కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం 2027లో జరగబోయే వన్డే ప్రపంచ కప్లో ఆడేందుకు ఆయన ఉద్దేశాన్ని స్పష్టంగా సూచిస్తోంది. ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ ఆడనున్నాడు. ఢిల్లీ జట్టు తరఫున విరాట్ బరిలోకి దిగుతాడు.
విరాట్ కోహ్లీ రాబోయే విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టు తరఫున ఆడనున్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అధ్యక్షుడు రోహన్ జైట్లీకి తెలిపారు.గతంలో మాజీ భారత కెప్టెన్ ఈ టోర్నమెంట్కు దూరంగా ఉండవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, వాటికి విరుద్ధంగా కోహ్లీ రాష్ట్ర క్రికెట్ సంఘం అధికారులకు ఫోన్ చేసి, డిసెంబర్ 24న ప్రారంభమయ్యే ఈ దేశీయ 50 ఓవర్ల టోర్నమెంట్ గ్రూప్ స్టేజ్ మొత్తానికి తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు."అతను మాకు తన లభ్యతను ధ్రువీకరించాడు. అతను ఢిల్లీ తరఫున ఆడాలని మేము ఆశిస్తున్నాము" అని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ తెలిపారు. డిసెంబర్ 24న విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభమవుతుంది. ఢిల్లీ తన మొదటి మ్యాచ్ను అదే రోజు అలూర్లో ఆంధ్రప్రదేశ్తో ఆడనుంది.

కోహ్లీ గ్రూప్ దశలోని మొత్తం 7 మ్యాచ్లు ఆడతాడా లేదా అనేది చూడాలి. ఎందుకంటే జనవరి 11 నుండి భారత్, న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో ఆడనుంది. కోహ్లీ ఈ సిరీస్లో పాల్గొనబోతున్నందున.. భారత శిబిరంలో చేరడానికి కొంత సమయం ముందు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, వర్క్లోడ్ తగ్గించుకోవడం కోసం కోహ్లీ నాలుగు లేదా ఐదు గ్రూప్ మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది, అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఢిల్లీ జట్టు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, సౌరాష్ట్ర, ఒడిశా, సర్వీసెస్, రైల్వేస్, హర్యానాతో కూడిన కష్టమైన గ్రూప్లో ఉంది.
బీసీసీఐ నిబంధనలు: దేశవాళీ తప్పనిసరి
జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే, ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధనను బీసీసీఐ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తోంది. దీని కారణంగానే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గతంలో రంజీ ట్రోఫీలో కూడా ఆడారు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని కోరుకుంటున్న కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ, విజయ్ హజారే ట్రోఫీలో క్రమం తప్పకుండా ఆడాల్సిన అవసరం ఉంది. విరాట్ కోహ్లీ ఆడటం ధ్రువీకరించబడగా.. రోహిత్ శర్మ కూడా ముంబై తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది, అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.