హైదరాబాద్: ఆఖరి వన్డేలో కూడా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా గురువారం కొలంబో వేదికగా జరిగిన నాలుగో వన్డేలో ఆతిథ్య శ్రీలంకపై కోహ్లీసేన 168 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'మాకు ఇది చాలా మంచి గేమ్. ఈ ప్రదర్శన ఎంతో సంతృప్తినిచ్చింది. మ్యాచ్లు ఆడేందుకు యువ ఆటగాళ్లు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తులో యువ క్రికెటర్లు మంచి ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నా' అని కోహ్లీ అన్నాడు.

'గత మూడు మ్యాచ్ల్లో టాస్ గెలిచినా తొలుత బ్యాటింగ్కు దిగలేదు. బ్యాటింగ్ చేసేందుకు ఈ వికెట్ చాలా అద్భుతంగా ఉంది. అందుకే నాలుగో వన్డేలో టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాం. భారీ స్కోరు చేస్తే... ఛేదనలో శ్రీలంక తడపడుతోందని ముందే ఉహించాం' అని కోహ్లీ చెప్పాడు.
ఇక ఆఖరి వన్డేలో కూడా ప్రయోగాలు చేస్తారా? అన్న ప్రశ్నకు గాను 'సిరీస్లో చివరిదైన ఐదో వన్డేలో యువ ఆటగాళ్లకు చోటు కల్పిస్తాం. నాలుగో వన్డేలో ముగ్గురికి అవకాశం ఇచ్చాం. వీరికి మళ్లీ మరో అవకాశం ఇస్తాం. ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. జట్టును, పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలు చేస్తాం' అని కోహ్లీ తెలిపాడు.
నాలుగో వన్డేలో శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ లసిత్ మలింగ 300 వికెట్లపై కోహ్లీ స్పందించాడు. 300 వికెట్లు తీయడమనేది ఎంతో ప్రత్యేకమని, అయితే అది కేవలం నెంబర్ మాత్రమేనని ఈ సందర్భంగా కోహ్లీ గుర్తు చేశాడు. ఇదిలా ఉంటే ఇరు జట్లు మధ్య ఆఖరి వన్డే సెప్టెంబరు 3న జరగనుంది.
కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (96 బంతుల్లో 131; 17 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (88 బంతుల్లో 104; 11 ఫోర్లు, 3 సిక్సర్లు)లు చెలరేగి ఆడటంతో భారత్ 168 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.
తద్వారా ఐదు వన్డేల సిరీస్లో భారత్ 4-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 375 పరుగులు చేసింది. కోహ్లీ, రోహిత్ శర్మలు సెంచరీలతో చెలరేగగా, చివర్లో మనీష్ పాండే (42 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు), ధోని (42 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోయారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 42.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. మాథ్యూస్ (80 బంతుల్లో 70; 10 ఫోర్లు), సిరివర్ధన (39) మినహా మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ రాణించలేదు. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.