విరాట్ కోహ్లి అభిమానులకు గుడ్ న్యూస్. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనకు కోహ్లి అందుబాటులో ఉండనున్నాడు. నయా కోచ్ గౌతమ్ గంభీర్ రిక్వెస్ట్ మేరకు భారత జట్టుతో కోహ్లి చేరనున్నాడు. టీ20 వరల్డ్ కప్ అనంతరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి తొలుత లంకతో వన్డే సిరీస్కు దూరం కావాలనుకున్నాడు. బీసీసీఐ కూడా కోహ్లికి విశ్రాంతి ఇవ్వాలని భావించింది.
కానీ కోచ్గా తన సరికొత్త కెరీర్ అదిరేలా ఆరంభించాలని శ్రీలంక పర్యటనను గౌతమ్ గంభీర్ చాలా సీరియస్గా తీసుకున్నాడు. స్టార్ ఆటగాళ్లందరూ తన మొదటి సిరీస్కు ఉండాలని కోరాడు. దీని గురించి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో గంభీర్ ప్రత్యేకంగా మాట్లాడాడు. గంభీర్ కోరడంతో ఈ ఇద్దరు దిగ్గజాలు లంకతో వన్డే సిరీస్కు అందుబాటులో ఉంటామని బీసీసీఐ కబురు పంపించారు.

జులై 27వ తేదీ నుంచి మొదలుకానున్న శ్రీలంక పర్యటనకు మరికాసేపట్లో భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. అయితే జస్ప్రీత్ బుమ్రా మాత్రం లంకతో సిరీస్లకు దూరం కానున్నాడు. బుమ్రా ఈ ఏడాది అవిరామంగా ఇంగ్లండ్తో సుదీర్ఘ టెస్టు సిరీస్, ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ఆడాడు. సెప్టెంబర్ నుంచి టెస్టు మ్యాచ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుమ్రాకు మాత్రం గంభీర్ ప్రత్యేక మినహాయింపు ఇచ్చాడు.
రోహిత్-కోహ్లిపై గంభీర్ ఎందుకు ఒత్తిడి తెచ్చాడు?
భారత్తో పోలిస్తే శ్రీలంక జట్టు బలహీనంగానే ఉంటుంది. యువ ఆటగాళ్లను పంపినా సిరీస్ను టీమిండియా సులువుగా గెలుస్తుంది. కానీ సీనియర్లు అందరూ భారత జట్టులో ఉండాలని గంభీర్ ప్రత్యేకంగా కోరాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉండటంతో రోహిత్-కోహ్లిని వన్డేల్లో ఆడమని గంభీర్ సూచించాడు. ఈ మెగాటోర్నీ ముందు భారత్ లంకతో పాటు ఇంగ్లండ్తో మాత్రమే వన్డే సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు గురించి ఓ అంచనాకు రావాలని టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్-కోహ్లిని లంకతో జరిగే వన్డేల్లో ఆడాలని గంభీర్ పట్టుబట్టాడు.
మరోవైపు యువ ప్లేయర్ రియాన్ పరాగ్ టీ20లు, వన్డేలకు ఎంపిక కానున్నాడు. అలాగే రోడ్డు ప్రమాదం కారణంగా 20 నెలలు వన్డేలకు దూరమైన పంత్ 50 ఓవర్ల ఫార్మాట్లో తిరిగి పునరాగమనం చేయనున్నాడు. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే.