దిగ్బ్రాంతికి లోనయ్యా: న్యూజిలాండ్ ఉగ్రదాడిపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ


హైదరాబాద్: న్యూజిలాండ్ సెంట్రల్ క్రైస్ట్ చర్చ్ నగరంలోని ఓ మసీదులో గుర్తు తెలియని ఆగంతుకుడు శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులు తెగబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 49 మంది మృతి చెందగా... మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడటంతో తీవ్ర ప్రాణనష్టం చోటుచేసుకుంది.
ఈ దాడి సమయంలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సభ్యులు కూడా మసీదులో ప్రార్థన చేసుకోవడానికి వెళ్లారు. దీంతో బంగ్లా క్రికెటర్లు సైతం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఐసీసీతో పాటు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ ఘటనపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్లో స్పందించాడు.
"షాకింగ్గా ఉంది. అదొక విషాద ఘటన. క్రైస్ట్ చర్చ్ నగరంలో జరిగిన ఘటన నన్ను బాధిస్తోంది. చనిపోయిన వారి గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నా. అలాగే బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాళ్ల గురించి కూడా. వారు సురక్షితంగా ఉన్నారు" అని కోహ్లీ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఉగ్రగాడి నేపథ్యంలో న్యూజిలాండ్-బంగ్లాదేశ్ జట్ల మధ్య శనివారం జరగాల్సిన మూడో టెస్టు రద్దు అయింది.
బంగ్లాదేశ్ బోర్డుతో చర్చించిన తర్వాతే మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో చివరిదైన హాగ్లే ఓవల్ టెస్టుని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్ అంతా క్షేమంగా ఉన్నారని ట్విట్టర్లో అధికారిక ప్రకటన చేసింది. న్యూజిలాండ్ గడ్డపై మూడు వన్డేలు, మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఫిబ్రవరి 10న బంగ్లాదేశ్ జట్టు వెళ్లింది.
సిరీస్లో ఇప్పటికే మూడు వన్డేలు, రెండు టెస్టులు ముగియగా.. ఒక టెస్టు మాత్రమే మిగిలి ఉంది. అది కూడా శనివారం నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా.. తాజాగా కాల్పుల నేపథ్యంలో.. ఆ టెస్టుని రద్దు చేస్తున్నట్లు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ప్రకటించాయి. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 2-0తేడాతో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది.

అసలేం జరిగింది?
హగ్లీపార్క్లో సమీపంలోని మజీదుపై ప్రార్థన సమయంలో నల్లరంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి అల్ నూర్ మసీదు లోపలకు వచ్చి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. కాల్పులకు తెగబడిన వ్యక్తిపై భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరుపుతున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
నగరంలోని ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు
నగరంలోని ప్రజలు ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడితో భయభ్రాంతులకు లోనైన సమీప ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు. మసీదులో పలు మృతదేహాలు పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించినప్పటికి ప్రాణనష్టం ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఇక, ప్రస్తుతం ఆ దేశ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఈ కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడింది. టెస్ట్ సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జట్టుతో మూడో టెస్టు ఆడనున్న బంగ్లా క్రికెట్ జట్టు దాడి సమయంలో ఆ ప్రాంతంలోనే ఉండడం గమనార్హం.
బంగ్లా ఆటగాళ్లు ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లగా
బంగ్లా ఆటగాళ్లు ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లగా.. ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం విన్న ఆటగాళ్లు పరుగులు తీశారు. ఈ కాల్పులు నుంచి బంగ్లా ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారని ఆ జట్టు ఆటగాడు తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశాడు. ‘‘దాడి నుంచి మొత్తం జట్టు తప్పించుకుంది. ఇది భయంకరమైన అనుభవం. మీ అందరి ఆశీస్సులే మమ్మల్ని కాపాడాయి" అని తమీమ్ పేర్కొన్నాడు.
బంగ్లా కోచ్ మాట్లాడుతూ
మరోవైపు బంగ్లా కోచ్ మాట్లాడుతూ ఈ కాల్పుల ఘటన జరిగిన సమీపంలోనే తమ ఆటగాళ్లు ఉన్నారని, కానీ ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి నష్టం జరగలేదని మీడియాకు తెలిపాడు. ఈ ఘటనతో ఆటగాళ్లు వణికిపోయారన్నాడు. ఆ అల్లానే తమని రక్షించారని ముష్పికర్ రహీమ్ ట్వీట్ చేశాడు. తాము చాలా అదృష్టవంతులమని, జీవితంలో మళ్లీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడదల్చుకోలేమని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications