
పూణే: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత అందుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి భారత జట్టుకు 200వ మ్యాచ్కు సారథ్యం వహించిన జాబితాలో కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. మూడు మ్యాచుల సిరీస్లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్తో పూణేలో జరిగిన మూడో వన్డే ద్వారా ఆ మార్కును చేరాడు. ఈ మ్యాచ్ కోహ్లీకి కెప్టెన్గా 200వ మ్యాచ్. ఫలితంగా టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 200వ మ్యాచ్కు సారథ్యం వహించిన మూడో కెప్టెన్గా నిలిచాడు. ఓవరాల్గా చూస్తే 200 అంతర్జాతీయ మ్యాచ్లు అంతకంటే ఎక్కువ మ్యాచ్లకు సారథ్యం వహించిన ఎనిమిదో కెప్టెన్గా కోహ్లీ గుర్తింపు పొందాడు.
అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్కు అత్యధిక మ్యచ్లలో కెప్టెన్సీ వహించిన కెప్టెన్గా ఎంఎస్ ధోనీ ఉన్నాడు. ధోనీ తన కెరీర్లో 332 మ్యాచ్లకు టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ధోనీ తరువాత భారత్ తరపున ప్రస్తుత హెచ్సీఏ అధ్యక్షుడు మొహ్మద్ అజారుద్దీన్ 221 మ్యాచ్లకు కెప్టెన్సీ వహించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా ఆ జాబితాలోకి చేరాడు. కోహ్లీ తరువాత ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (196) ఉండడం గమనార్హం.
అంతర్జాతీయంగా ఇప్పటికే ఏడుగురు కెప్టెన్లు విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు. టీమిండియా చరిత్రలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎంఎస్ ధోనీ (332) స్థాయిలో మ్యాచ్లకు మరెవరూ కెప్టెన్సీ వహించలేదు. ధోనీ తరువాత ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (324), కివీస్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (303), దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (286), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ (271), శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ (249), టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ (221)లు వరుసగా ఉన్నారు.
ఆదివారం ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మూడో వన్డేలో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ధావన్ (67), పంత్ (78) హార్దిక్ (64) అర్ధ శతకాతో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లలో మార్క్వుడ్ (3/34), రషీద్ (2/81) రాణించారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 322 పరుగులు చేసింది. చివరి వరకూ పోరాడిన సామ్ కరన్ (95 నాటౌట్) భారత్ను భయపెట్టాడు. మలన్ (50) ఆకట్టుకున్నాడు. శార్దూల్ (4/67), భువనేశ్వర్ (3/42) సత్తాచాటారు.