టెస్టు క్రికెట్లో బెస్ట్ కెప్టెన్లలో విరాట్ కోహ్లీ ఒకడు. కేవలం టీమిండియానే కాదు. ప్రపంచ వ్యాప్తంగా టెస్టు క్రికెట్కు జీవం పోసిన కెప్టెన్ అతను. ఈ క్రమంలోనే డబ్ల్యూటీసీ ఫైనల్లో రోహిత్ సేన ఓడిపోవడంతో మళ్లీ జట్టు పగ్గాలను కోహ్లీకి అప్పగించాలని చాలా మంది డిమాండ్ చేశారు. అయితే కోహ్లీ, లేదంటే అశ్విన్ను టెస్టు కెప్టెన్ చేయాలని, రోహిత్ను కెప్టెన్సీ నుంచి తీసేయాలని అంటున్నారు.
అయితే తనకు తానే కెప్టెన్సీని వదులుకున్న కోహ్లీకి మళ్లీ పగ్గాలు అందించడం జరిగే పని కాదని మాజీ క్రికెటర్, ప్రముఖ అనలిస్ట్ ఆకాష్ చోప్రా అంటున్నాడు. వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టుకు కోహ్లీని కెప్టెన్ చేయడం కరెక్ట్ కూడా కాదన్నాడు. భారత జట్టు పగ్గాలను కోహ్లీకి ఇవ్వడం అసాధ్యమేమీ కాదన్న చోప్రా.. కానీ అలా మాత్రం జరగదని తేల్చేశాడు. అదే సరైన నిర్ణయం కూడా అన్నాడు.

'కోహ్లీని కెప్టెన్ చేయొచ్చు కానీ.. చెయ్యరు. అలా చెయ్యకపోవడమే కరెక్ట్ కూడా. ఎందుకంటే కెప్టెన్సీ వదిలేయమని కోహ్లీకి ఎవరూ చెప్పలేదు. తనే ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని చాలా మంది చెప్పారు. టెస్టుల్లో కెప్టెన్సీ నుంచి అతన్ని తొలగిస్తున్నట్లు ఎవరూ చెప్పలేదు. కోహ్లీనే ఆ డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి.. మళ్లీ అతన్ని కెప్టెన్ చేయకపోవడమే కరెక్ట్' అని చోప్రా చెప్పాడు. టీ20 కెప్టెన్సీని కోహ్లీ వదులుకోగానే.. అతన్ని వన్డే కెప్టెన్గా బీసీసీఐ తొలగించిన సంగతి తెలిసిందే.
సౌతాఫ్రికాలో 2022లో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత తను ఈ ఫార్మాట్లో కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. అప్పటి వరకు 68 టెస్టులకు సారధ్యం వహించిన కోహ్లీ 40 విజయాలతో అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్గా నిలిచాడు. కానీ బీసీసీఐ, కోహ్లీ మధ్య విభేదాల నేపథ్యంలోనే టెస్టు కెప్టెన్సీని కోహ్లీ వదులుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అతన్ని మళ్లీ టెస్టు కెప్టెన్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
'నిజానికి కోహ్లీ ఇలా టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికినప్పుడు బీసీసీఐ షాకైంది. ఎందుకంటే వాళ్లు అది ఊహించలేదు. కోహ్లీ నిర్ణయంతో వాళ్లు సడెన్గా కొత్త కెప్టెన్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు అదంతా అనవసరం. అది వేరే మ్యాటర్ కూడా. కానీ ఇప్పుడు మాత్రం కోహ్లీని మళ్లీ కెప్టెన్ చేయడం కరెక్ట్ కూడా కాదు' అని చోప్రా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.