హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రమాణాలను అందుకోగల సత్తా ఒక్క విరాట్ కోహ్లీకి మాత్రమే ఉందని పాక్ మాజీ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ అభిప్రాయపడ్డాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో సక్లెయిన్ ముస్తాక్ మాట్లాడుతూ "బ్యాట్స్మన్గా సచిన్ గొప్ప ఆటగాడు. ఇద్దరి మధ్య పోలిక తేవడం లేదు కానీ ప్రస్తుత ఆటగాళ్లలో సచిన్కు దగ్గరగా రాగల సత్తా కోహ్లీకి మాత్రమే ఉంది" అని అన్నాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ స్పిన్ కన్సల్టెంట్గా ఉన్న సక్లెయిన్ ముస్తాక్ ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్పై స్పందించాడు. "ట్రెంట్బ్రిడ్జ్లో అతడాడిన తీరుపై ఇంగ్లండ్ జట్టు సహాయక సిబ్బందితో చర్చించాం. ఆండర్సన్ అతడిని ఎంత విసిగించినా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కనబరిచాడు. క్రమపద్ధతిలో ఇన్నింగ్స్ ఆడుకుంటూ వెళ్లాడు" అని ముస్తాక్ కోహ్లీ ఇన్నింగ్స్ని కొనియాడాడు.
"పరుగుల దాహంతో తపించిపోయే కోహ్లీలాంటి ఆటగాడు జట్టులో ఉంటే విజయాలు దానంతటవే వస్తాయి. విరాట్ కోహ్లీ ఇలాగే పరుగులు సాధిస్తే ఆతిథ్య జట్టుకు కష్టమే" అని సక్లెయిన్ తెలిపాడు. ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్లు(97, 103) కలిసి 200 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం లభించింది. ఇక, ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భారత పేసర్లు, స్పిన్నర్ అశ్విన్ అంచనాలకు మించి రాణిస్తున్నారంటూ సక్లెయిన్ ముస్తాక్ కొనియాడాడు.