
హైదరాబాద్: టీమిండియాకు అసలైన పరీక్ష దక్షిణాఫ్రికా గడ్డపైనే ఉంటుందని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ అభిప్రాయపడ్డాడు. కోల్కతాలో జరిగిన జగ్మోహన్ దాల్మియా స్మారక కార్యక్రమంలో పాల్గొన్న అజహరుద్దీన్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.
'శ్రీలంకతో జరుగబోయే సిరీస్లో కూడా పోటీ ఉంటుంది. కానీ అసలు సిసలు పరీక్ష మాత్రం వచ్చే ఏడాది జరిగే దక్షిణాఫ్రికా పర్యటనలోనే ఎదురవుతుంది. ఇక కెప్టెన్గా విరాట్ కోహ్లీ జట్టుని ముందుండి నడిపిస్తున్న తీరు అద్భుతం. వ్యూహాలు అమలు చేయడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో మంచి పరిణతిని చూపెడుతున్నాడు' అని అజర్ అన్నాడు.

రాబోయే కాలంలో టీమిండియాకు అతిపెద్ద సవాల్ ఎదురుకాబోతుందని, దానిని అధిగమిస్తే ఇక తిరుగుండదని అజర్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఈడెన్ గార్డెన్స్తో తనకున్న అనుబంధాన్ని కూడా అజహరుద్దీన్ గుర్తు చేసుకున్నాడు.
'ఈడెన్ గార్డెన్స్లో నాకు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. ఈ గ్రౌండ్ అంటే ఎంతో ఇష్టం' అని అజహరుద్దీన్ చెప్పుకొచ్చాడు. 1993లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ నిర్వహించిన క్యాబ్ జూబ్లి ఇయర్ హీరో కప్ టోర్నీకి అజహరుద్దీన్ కెప్టెన్గా వ్యవహరించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్లో , గూగుల్ ప్లస్ ఫాలో అవ్వండి.