
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన టెస్టు ప్లేయర్ ర్యాంకింగ్స్లో ముగ్గురు భారత బ్యాట్స్మెన్లకు టాప్-10లో చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు మ్యాచ్ ఆడకపోయినా.. ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. కోహ్లీ ఖాతాలో 886 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక ర్యాంకు కోల్పోయి 877 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు.
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ 911 రేటింగ్ పాయింట్లతో బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో స్మిత్, కోహ్లీ పోటీపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరి మధ్య 25 పాయింట్ల అంతరం ఉంది. మార్నస్ లబుషేన్ (827), బాబర్ అజామ్ (797), డేవిడ్ వార్నర్ (793) వరుసగా ఉన్నారు. టెస్టు స్పెషలిస్ట్ చేటేశ్వర్ పుజారా (766) ఏడో ర్యాంకును నిలబెట్టుకోగా.. ఆజింక్య రహానె (726) పదో ర్యాంకు దక్కించుకున్నాడు.
టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (756) ఒక స్థానాన్ని మెరుగుపరచుకొని పదో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా స్పీడ్స్టర్ పాట్ కమిన్స్ (904) నంబర్వన్ బౌలర్గా కొనసాగుతున్నాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (779) ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు. ఆల్రౌండర్ జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా (397), రవిచంద్రన్ అశ్విన్ (281) టాప్-10లో చోటు దక్కించుకున్నారు.
ఇక జట్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా (116) మొదటి స్థానంలో ఉంది. న్యూజీలాండ్ (116) రెండో స్థానంలో ఉంది. భారత్ (114) పాయింట్లతో మూడో స్థానం దక్కించుకుంది. వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ను కివీస్ 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ అనంతరం ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 17 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.