2027 వరల్డ్ కప్పై కోహ్లీ క్లారిటీ!
విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్లో ఈ పేరు ఓ సంచలనం. స్టేడియంలోకి కోహ్లీ అడుగుపెట్టాడంటే రికార్డులు తిరగరాయాల్సిందే అయితే గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ ఫామ్, భవిష్యత్తు ప్రణాళికలపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ కప్లో కోహ్లీ ఆడతాడా? లేదా? అనే ప్రశ్నపై తాజాగా విరాట్ కోహ్లీ స్వయంగా స్పందించాడు. ఆర్సీబీ విడుదల చేసిన ఓ పాడ్కాస్ట్లో కోహ్లీ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
విలువ ఇచ్చే చోటే ఉంటాను: విరాట్ కోహ్లీ
పాడ్కాస్ట్లో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తాను ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. "నేను ఓ వాతావరణంలో ఉన్నప్పుడు, అక్కడ నా వల్ల విలువ పెరుగుతుందని నేను భావించాలి, అలాగే అవతలి వారు కూడా నేను విలువైన వాడినని గుర్తించాలి. అలాంటప్పుడే నేను అక్కడ కనిపిస్తాను. ఒకవేళ నేను నా విలువను నిరూపించుకోవాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే, అలాంటి చోట నేను ఉండలేను" అని కోహ్లీ కుండబద్దలు కొట్టాడు. ఆట పట్ల తన నిబద్ధత ఎప్పుడూ తగ్గలేదని, ప్రిపరేషన్ విషయంలో తాను చాలా నిజాయితీగా ఉంటానని వెల్లడించాడు.

మైదానంలో ఎంత కష్టపడటానికైనా సిద్ధం
ఫిట్నెస్ విషయంలో తనకున్న పట్టుదల గురించి చెబుతూ.. "జట్టు కోసం వన్డే మ్యాచ్లో 40 ఓవర్ల పాటు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేయమన్నా నేను ఫిర్యాదు చేయకుండా చేస్తాను. ఎందుకంటే నేను దానికోసం సిద్ధమయ్యాను. నా కెరీర్లో ప్రతి బంతిని నా చివరి బంతిలా భావించి ఆడతాను. అంత కష్టపడి ఆడిన తర్వాత కూడా నేను నా విలువను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే, అది నాకు సరైన ప్రదేశం కాదు" అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
విజయ్ హజారే ట్రోఫీ అనుభవాలు
ఇటీవల దేశవాళీ క్రికెట్ (విజయ్ హజారే ట్రోఫీ)లో పాల్గొనడంపై కూడా కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఢిల్లీ తరపున ఆడినప్పుడు తాను మళ్లీ ఓ చిన్న పిల్లాడిలా ఫీలయ్యానని చెప్పాడు. ఎవరికో నిరూపించుకోవడానికి కాకుండా కేవలం క్రికెట్ మీద ఉన్న ప్రేమతోనే తాను ఆ టోర్నీ ఆడానని వివరించాడు. గతేడాది కాలంగా కోహ్లీ టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి.. కేవలం వన్డే ఫార్మాట్కే పరిమితమైన సంగతి తెలిసిందే.
2027 వరల్డ్ కప్పై క్లారిటీ
2027 వన్డే ప్రపంచకప్ గురించి వస్తున్న ప్రశ్నలపై కోహ్లీ స్పందిస్తూ.. "భారత్ తరపున వరల్డ్ కప్ ఆడటం ఎప్పుడూ అద్భుతమే. కానీ ఆ ప్రయాణం ఇరువైపుల నుంచి గౌరవప్రదంగా ఉండాలి. నాకు ఆట అంటే ఇష్టం, అందుకే కొనసాగుతున్నాను. ఒకవేళ పరిస్థితులను సంక్లిష్టంగా మార్చాలని చూస్తే, నేను తప్పుకోవడానికి వెనుకాడను" అని పరోక్షంగా బీసీసీఐకి,సెలెక్టర్లకు తన సందేశాన్ని పంపాడు. ప్రస్తుతం కోహ్లీ వన్డేల్లో 311 మ్యాచుల్లో 14,797 పరుగులు చేసి, 54 సెంచరీలతో అత్యధిక సెంచరీల రికార్డును తన పేరిట ఉంచుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications