క్రికెట్ కింగ్ కోహ్లీ చిన్నతనం నుంచి సరదా మనిషే. ప్రస్తుతం ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతంగా రాణిస్తున్న కోహ్లీ గురించి అతని చిన్ననాటి స్నేహితుడు ఆసక్తికర విషయం వెల్లడించాడు. తాజాగా ఆర్సీబీ యూట్యూబ్ ఛానెల్లో కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ పాల్గొన్నాడు. అతనితోపాటు కోహ్లీతోపాటు శర్మ దగ్గర కోచింగ్ తీసుకున్న షాల్ సోంధీ కూడా ఉన్నాడు.
తను కోచింగ్ ఇచ్చే సమయంలో వారానికి ఒకసారి ఊళ్లో అందర్నీ పరిగెత్తించే వాడినని రాజ్కుమార్ చెప్పాడు. ఆ టైంలో కోహ్లీ చాలా తుంటరి పిల్లాడని, అతనిపై ఒక కన్నేసి ఉంచాల్సి వచ్చేదన్నాడు. ఇది విన్న వెంటనే సోంధీ ఒక ఆసక్తికర విషయం చెప్పాడు. తాము ఐదు, ఆరు కిలోమీటర్లు పరిగెత్తాల్సి వచ్చేదని, అయితే కోహ్లీ ఈ రేస్లో మోసం చేసేవాడని వెల్లడించాడు.

'మేం అందరం పరిగెడుతూ ఉండేవాళ్లం. కోహ్లీ అందరి కన్నా వెనుక పడినప్పుడు.. అటుగా సైకిల్పై వెళ్తున్న ఎవరో ఒకరిని పట్టుకొని లిఫ్ట్ అడిగేవాడు. వాళ్ల సైకిల్ ఎక్కి ఫస్ట్ ప్లేస్లో ఉండే ప్లేయర్ను దాటేసిన తర్వాత దిగేవాడు. అప్పటికి మాపై ఒక కన్నేసి ఉంచడానికి కోచ్ వచ్చేవారు. అప్పుడు అందరి కన్నా ముందు కోహ్లీ ఉండటం చూసి మెచ్చుకునే వాళ్లు. మేమందరం నోరెళ్లబెట్టేవాళ్లం' అని చెప్పి నవ్వేశాడు.
అయితే కోహ్లీ చిన్నతనంలోనే అతని ఆట చూసి ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడని తాను నమ్మినట్లు చెప్పాడు. 'ఒకసారి స్టేట్ మ్యాచ్ ఆడుతున్నాం. ఒకపక్క వరుసగా వికెట్లు పడుతున్నాయి. కోహ్లీ 190 రన్స్తో ఆడుతున్నాడు. అప్పుడే నేను క్రీజులోకి వెళ్లా. నా దగ్గరకు వచ్చి క్రీజులో ఉండు అంతే.. ఏం చెయ్యాలో నేను చేస్తా అని చెప్పాడు. చూస్తుండగానే 250 రన్స్ చేశాడు. అప్పుడే అనుకున్నా.. వీడు కచ్చితంగా గొప్ప ప్లేయర్ అవుతాడని' అని గుర్తుచేసుకున్నాడు.
అలాగే తామిద్దరం కూడా బాగా తిండిపోతులం అని చెప్పాడు. చిన్నతనంలో కోచింగ్ ముగిసిన ప్రతిసారీ.. ఎదురుగా ఉండే ఒక చైనీస్ బండి ఉండేదని, అక్కడ ఎగబడి ఫుడ్ తినేవాళ్లమని వెల్లడించాడు. ఒక్కోసారి ఇద్దరిలో ఎవరు ఎక్కువ తింటారని పోటీ పడేవాళ్లం అని తెలిపాడు. 'ఇక రామ్కీ చోలే బతూరే ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ రెస్టారెంట్తో మా ఎన్నో అనుభవాలు ముడి పడి ఉన్నాయి' అని పేర్కొన్నాడు.