హైదరాబాద్: ముంబైలో రూ.34 కోట్లతో ఇల్లు కొనేందుకు చేసుకున్న ఒప్పందాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రద్దు చేసుకున్నాడు. ముంబైలోని ఓ విలాసవంతమైన ఏరియాలో రూ.34 కోట్లతో ఇల్లు కొనేందుకు కోహ్లీ రెండేళ్ల క్రితం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఆ ఇల్లును కొనేందుకు చేసుకున్న ముందస్తు ఒప్పందాన్ని కోహ్లీ తాజాగా రద్దు చేసుకున్నాడు. ముంబైలోని టోనీ వోర్లి ఏరియాలో ఓంకార్ బిల్డర్స్ సంస్థ తలపెట్టిన విలాసవంతమైన అపార్ట్మెంట్లో 35వ ఫ్లోర్లోని 7,171 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్ను కొనుగోలు చేయాలని కోహ్లీ 2016 జూన్ నెలలో ఒప్పందం చేసుకున్నాడు.
అత్యాధునిక హంగులతో కూడిన నిర్మాణం, ప్రత్యేకంగా జాగింగ్, వాకింగ్ చేసుకునేందుకు కారిడార్స్ కూడా ఉన్న సదరు ఇంటికి కోటిన్నర డిపాజిట్ చేయగా, దాదాపు మరో కోటితో అగ్రిమెంట్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడా ఒప్పందాన్ని కోహ్లీ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కోహ్లి కంటే ముందు ఆ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ని కొనుగోలు చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ సూచన మేరకు అప్పట్లో కొనుగోలుపై విరాట్ కోహ్లీ ఆసక్తి చూపాడు. అయితే గతేడాది బాలీవుడ్ నటి అనుష్క శర్మని వివాహం చేసుకున్న తర్వాత ప్రస్తుతం ముంబైలో ఓ ఖరీదైన ఇల్లుని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.
రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్న ఈ ఇంటికి విరాట్ కోహ్లీ రూ. 15 లక్షల అద్దె చెల్లిస్తున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఏప్రిల్ 7నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 11వ సీజన్లో బిజీగా ఉన్నాడు. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే.