విశాఖపట్నం: విరాట్ కోహ్లీ నుంచి టీమిండియా ప్రతిసారి విజయాలను ఆశించడం ఎంతమాత్రం తగదని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. రాంచీలో ముగిసిన నాలుగో వన్డే టీమిండియా మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో న్యూజిలాండ్ చేతిలో భారత్ 19 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
దీంతో ఐదు వన్డేల సిరిస్ 2-2తో సమం అయింది. వన్డే సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే ఐదో వన్డే మ్యాచ్ విశాఖపట్నంలో శనివారం జరగనుంది. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ మీడియాతో మాట్లాడాడు. ఈ మధ్య కాలంలో కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు.
అయితే ఎప్పుడూ అతడే జట్టుకు విజయాల్ని అందంచాలని భావించడం ఎంతవరకు సమంజసమని గవాస్కర్ ప్రశ్నించాడు. ప్రతి మ్యాచ్లోనూ కోహ్లీపై టీమిండియా ఆధారపడటం అత్యాశే అవుతుందని పేర్కొన్నాడు. నాలుగో వన్డేలో కోహ్లీ చేసిన 45 పరుగులు టీమిండియా విజయానికి ఏమాత్రం దోహదపడలేదు.

ఇండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసుకున్నాయి. మూడు, నాలుగు వన్డేల్లో కెప్టెన్ ధోని నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వస్తున్న సంగతి తెలిసిందే. మూడో వన్డేలో ధోని కొంతమేరకు సక్సెస్ సాధించినా రాంచీలో జరిగిన నాలుగో వన్డేలో పూర్తిగా విఫలమయ్యాడు.
బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసి టీమిండియా ప్రయోగాలను చేస్తుందని గవాస్కర్ పేర్కొన్నాడు. 'న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్లో భారత ప్రతీ విజయంలో కోహ్లీ పాత్ర ఉండాలని కోరుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు' అని గవాస్కర్ పేర్కొన్నాడు.
భారమంతా కోహ్లీపైనే వేసి, అతడే విజయాన్ని సాధించాలనే అత్యాశను వదిలి పెట్టి టీమిండియా సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చాడు. మరోవైపు నాలుగో వన్డేలో అక్షర పటేల్ను మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో పంపడాన్ని కూడా గవాస్కర్ తప్పుబడ్డాడు.
జట్టులో స్పెషలిస్టు ఆటగాళ్లు అయిన మనీష్ పాండే, కేదర్ జాదవ్లను వెనక్కునెట్టి అక్షర పటేల్ను ఐదో స్థానంలో బ్యాటింగ్కు తీసుకురావడం అంత మంచి ప్రయోగం కాదన్నాడు. కాగా ఈ మ్యాచ్లో ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర పటేల్ 40 బంతులాడి 38 పరుగులు సాధించాడు.