హైదరాబాద్: కెప్టెన్సీలో ధోని, రోహిత్ శర్మలతో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పొల్చొద్దంటూ టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ కెప్టెన్సీపై తాజాగా గౌతమ్ గంభీర్ మరోసారి స్పందించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
"రోహిత్ శర్మ ఐపీఎల్లో విజయవంతమయ్యాడు. అతడి కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటే రోహిత్ అత్యంత విజయవంతమైన కెప్టెన్. అతడి సారథ్యంలో టీమిండియా ఆసియా కప్ కూడా సొంతం చేసుకుంది. కోహ్లీ తర్వాత కెప్టెన్గా అతడే సరిపోతాడు. అయితే కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీని పోల్చలేం" అని అన్నాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ఆర్సీబీ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు వరుసగా ఆరు ఓటములను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఐపీఎల్లో ఆర్సీబీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు.
2016లో మాత్రం ఫైనల్కు చేరింది. మరోవైపు రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ నాలుగోసారి టైటిల్ విజేతగా నిలవగా... ధోనీ కెప్టెన్సీలోని చెన్నై మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక, వరల్డ్కప్ గురించి గంభీర్ మాట్లాడుతూ "భారత్కు మరో నాణ్యమైన పేసర్ కావాలి. బుమ్రా, షమీ, భువీలకు మరింత ప్రోత్సాహం అవసరం. జట్టులో హార్దిక్, శంకర్ వంటి ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఉన్నప్పటికీ ఆ మాటలతో నేను ఏకీభవించను" అని అన్నాడు.