
హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును అందుకునే సత్తా ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉందని టీమిండియా మాజీ లెజెండరీ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం సఫారీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరు వన్డేల సిరిస్లో కోహ్లీ మూడు సెంచరీలు చేయడంతో పాటు తన కెరీర్లో 35 సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత అలవోకగా సెంచరీలు సాధిస్తున్నాడు. గతంలో ఏ క్రికెటరూ లేనంతగా స్థిరంగా విరాట్ కోహ్లీ రాణిస్తున్నాడు.
స్థానికంగా ఓ ఈవెంట్లో పాల్గొన్న గుండప్ప విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ 'కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. నిలకడగా ఆడుతూ స్థిరంగా రాణిస్తున్నాడు. తరుచూ సెంచరీలు కొడుతున్నాడు. సచిన్ వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. రికార్డులు ఉన్నదే బద్దలు కావడానికి. నిజంగా కోహ్లి ఈ ఘనత సాధిస్తే నేనెంతో సంతోషిస్తా' అని అన్నాడు.
'సచిన్ కూడా ఎంతో ఆనందపడతాడు. అయితే విరాట్ కోహ్లీ ఈ రికార్డు బద్దలు కొట్టడానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం కోహ్లీ పరుగుల దాహం, దూకుడుతో అతను ఎవరికీ అందని స్థాయిలో ఉన్నాడు. ఇదే విశ్వాసాన్ని అతను జట్టులోనూ నింపుతున్నాడు. సహచరులను తన బాటలోకి తీసుకెళ్తున్నాడు. ఇదే భారత విజయపరంపరకు కారణం. కోహ్లీని ఎవరితో పోల్చడం నాకిష్టం లేదు' అని విశ్వనాథ్ పేర్కొన్నాడు.
ఎందుకంటే భారత్ ఇటీవల సాధించిన విజయాల్లో ఎక్కువగా ఉపఖండంలోనే ఉన్నాయని అన్నాడు. ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికాలో అద్భుత ప్రదర్శన చేస్తోందని కొనియాడాడు. చారిత్రక విజయాలు సాధించిందని, ఇదే విజయపరంపర మిగతా దేశాల్లో కూడా కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నాడు.