
హైదరాబాద్: ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. సఫారీ పిచ్లపై భారత ఆటగాళ్లు తేలిపోతారంటూ గత కొన్ని రోజులుగా దక్షిణాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు మీడియా సమావేశాల్లో వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోహ్లీసేనను తక్కువగా అంచనా వేయొద్దంటూ ఆ దేశ మాజీ ఆటగాడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్కతా నైట్ రైడర్స్ కోచ్ జాక్వస్ కల్లిస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కల్లిస్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ 'కోహ్లీసేన వరస విజయాలతో మంచి ఊపు మీదుంది. వారి బౌలింగ్ లైనప్ అద్భుతమనే చెప్పాలి' అని అన్నారు.
'ముఖ్యంగా ప్రత్యర్థి జట్టుపై భారత జట్టు చేసే వారి దాడి ఆసక్తికరంగా ఉంటుంది. అన్నింటికి మించి పర్యాటక జట్టు కెప్టెన్గా కోహ్లీ ఉన్నాడు. అతను వరల్డ్ క్లాస్ ప్లేయర్. ఐపీఎల్లో అతన్ని చాలా దగ్గరగా చూశాను. ఆకలితో ఉన్న సింహం లాంటోడు. ప్రత్యర్థుల బౌలింగ్కు అలవాటుపడితే మాత్రం అతన్ని ఆపటం చాలా కష్టం. ఈ విషయంలో సఫారీ బౌలర్లు మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది' అని హెచ్చరించాడు.
అదే సమయంలో టీమిండియా బౌలింగ్ విభాగంపై కూడా కల్లిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత బౌలర్లు మహమ్మద్ షమీ, భువనేశ్వర్ల ప్రతిభ గురించి ప్రత్యేకంగా కొనియాడాడు. సఫారీ బ్యాట్స్మెన్ వాళ్లిద్దరి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఇక, యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్కు కోసం తాను ఎంతో ఆతృతగా ఉన్నట్లు కల్లిస్ చెప్పుకొచ్చాడు.
గాయం నుంచి కోలుకుని డెయిల్ స్టెయిన్ జట్టులోకి రావటంపై కూడా కల్లిస్ స్పందించాడు. దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా షాన్ పొల్లాక్ ఉండగా, అతడికి రికార్డుకి స్టెయిన్ చేరువయ్యాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కోహ్లీసేన మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జనవరి 5న ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.