
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భారీ ఖర్చుతో ఒక కొత్త ఇల్లు కొన్నాడు. ముంబైలోని అలీబాగ్లో ఈ ఇంటిని కొన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ చేపట్టిన లగ్జరీ బంగ్లా ప్రాజెక్టు ఆవాస్ విలేజ్లో ఒక ఇంటిని కోహ్లీ కొన్నాడు. మొత్తం 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని రూ.6 కోట్లకు కోహ్లీ కొన్నట్లు సమాచారం. చాలా అందంగా నిర్మించిన ఈ ఇళ్లకు సెలెబ్రిటీల్లో మంచి డిమాండ్ ఉన్నట్లు ప్రాజెక్టు నిర్వాహకులు చెప్తున్నారు.
'సహజ సిద్ధమైన అందం ఉండటంతో ఆవాస్లో ఇళ్లు కొనేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. అంతేకాదు ఇంక్కడికి మాండ్వా జెట్టీ కేవలం ఐదు నిమిషాల దూరంలోనే ఉంటుంది. ఇక్కడి నుంచి స్పీడ్ బోట్లపై ముంబై వెళ్లడానికి కేవలం 15 నిమిషాలు పడుతుందంతే' అని ఆవాస్ లివింగ్ ప్రాజెక్టు లీగల్ కన్సల్టెంట్గా ఉన్న మహేష్ మాత్రే తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ వల్ల కోహ్లీ బిజీగా ఉన్నాడని, దీంతో అతని సోదరుడు వికాస్ కోహ్లీ ఈ ఇంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశాడని మాత్రే వెల్లడించారు.
ఈ ఇంటి కోసం స్టాంప్ డ్యూటీ కింద రూ.36 లక్షలు కోహ్లీ చెల్లించాడని, ఈ డీల్లో భాగంగా అతనికి 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే స్విమ్మింగ్ పూల్ కూడా లభిస్తుందని తెలుస్తోంది. కోహ్లీ ఇక్కడ లగ్జరీ విల్లా కొనాలని అనుకుంటున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అతను ఈ బంగ్లా కొనేసినట్లు తెలుస్తోంది. కాగా, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో ఆడుతున్న కోహ్లీ తొలి టెస్టులో విఫలమయ్యాడు. కానీ ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో పట్టుదలగా ఆడాడు. అయితే అంపైర్ ఇచ్చిన వివాదాస్పద నిర్ణయం కారణంగా తొలి ఇన్నింగ్స్లో అవుటయ్యాడు. ఇండోర్ వేదికగా జరిగే మూడో టెస్టులో అయినా అతను భారీ స్కోరు చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.