సచిన్ రికార్డు బ్రేక్
సౌతాఫ్రికాతో తొలి వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ 51 పరుగులతో రాణించాడు. అయితే ఈ క్రమంలో 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. వన్డే ఫార్మాట్లో విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. ఇప్పటివరకు విదేశాల్లో ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో 5065 పరుగులతో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. అంతతకుముందు 5057 పరుగులతో ఉన్న విరాట్ కోహ్లీ 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేరుకోగానే సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. బుధవారం చేసిన 51 పరుగులతో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 5108 పరుగులు ఉన్నాయి. ఇక సచిన్ కోహ్లీ తర్వాత ధోని, ద్రావిడ్, గంగూలీ వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు.
ద్రావిడ్, గంగూలీ రికార్డులు బ్రేక్
తొలి వన్డేలో హాఫ్ సెంచరీ ద్వారా రాణించి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రికార్డులను విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్లో సౌతాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో ద్రావిడ్, గంగూలీ రికార్డులను కోహ్లీ బ్రేక్ చేశాడు. ఇప్పటివరకు సఫారీలపై గంగూలీ 1313 పరుగులు చేయగా, ద్రావిడ్ 1309 పరుగులు చేశాడు. అంతకుముంద తన ఖాతాలో 1287 రన్స్ ఉండగా తొలి వన్డేలో 51 పరుగులు చేయడం ద్వారా గంగూలీ, ద్రావిడ్ను కోహ్లీ అధిగమించాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 1338 పరుగులు ఉన్నాయి.
భారత్ ఓటమి
బుధవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. 31 పరుగులతో ఓడి 3 వన్డేల సిరీస్లో 0-1తో వెనుకబడింది. దీంతో భారత జట్టు సిరీస్ గెలవాలంటే మిగతా రెండు వన్డే మ్యాచ్లు గెలవాల్సిందే. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ బవుమా, డస్సెన్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాహుల్ సేన 265 పరుగులకే పరిమితమైంది. టాపార్డర్ రాణించినప్పటికీ మిడిలార్డర్ రాణించకపోవడంతో భారత్ లక్ష్యాన్ని చేధించలేకపోయింది. భారత బ్యాటర్లలో ధావన్ 75, కోహ్లీ, 51, ఠాకూర్ 50 పరుగులతో రాణించారు. ఇక సిరీస్లోని రెండో వన్డే శుక్రవారం జరగనుంది. కాగా ఇప్పటికే టెస్ట్ సిరీస్ను టీమిండియా 1-2తో కోల్పోయిన సంగతి తెలిసిందే.