హైదరాబాద్: మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టు ఆదివారంతో ముగిసింది. ఈ టెస్టులో ఆతిథ్య శ్రీలంకపై ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ విజయంతో మరో టెస్టు మిగిలుండగానే 2-0తో సిరిస్ను కైవసం చేసుకుంది. ఈ సిరిస్లో ఆఖరిదైన మూడో టెస్టు ఆగస్టు 12 నుంచి పల్లెకెలెలో ప్రారంభం కానుంది. రెండో టెస్టు మ్యాచ్ విజయం అనంతరం భారత జట్టు తమ కొద్దిపాటి ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తోంది.
టీమిండియా జట్టు బస చేసిన హోటల్ స్విమ్మింగ్పూల్లో భారత జట్టు ఆటగాళ్లు కేరింతలు కొడుతున్న వీడియోను ఇండియన్ క్రికెట్ టీమ్ తమ ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ విరాట్ కొహ్లీ, శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మలతో ఇతర క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బంది ఉన్నారు.
ఇక, ఆదివారం మ్యాచ్ అనంతరం ధావన్, కోహ్లీ, పుజారా ఫ్రెండ్ షిప్ డేని జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ధావన్ తన ట్విటర్ ద్వారా అభిమానులతో షేర్ చేశాడు. 'అభిమానులందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఆనందంగా, మస్తీతో గడపండి' అంటూ ధావన్ ట్వీట్టర్లో కామెంట్ పోస్టు చేశాడు.