

హైదరాబాద్: క్రికెట్ గురించి పెద్దగా తెలియకపోయినా విరాట్-అనుష్కాల ప్రేమాయాణం గురించి మాత్రం తెలియని వాళ్లుండరు. టీమిండియాను తానొక్కొడై నడిపించే కోహ్లీని నడిపించేది అనుష్క శర్మేనని విరాట్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనను ముగించుకొని విరామం తీసుకొనేందుకు ఇండియాకు తిరుగుప్రయాణమైన విరాట్ కోహ్లీకి తన భార్యే స్వాగతం పలికింది.
అంతేకాదు వేరే సినిమా ప్రమోషన్లో భాగంగా ఆమె వెంటనే వెళ్లాల్సి ఉండడంతో వీడ్కోలు తెలుపుతూ ఓ హగ్ ఇచ్చి వెళ్లిపోయింది. ఎన్నోసార్లు విరుష్కా జోడి వారి ప్రేమను పబ్లిక్గానే బహిర్గతం చేశారు. చాలా సార్లు స్టేడియంలోనే సెంచరీలు చేసి.. లేదా మ్యాచ్ను ముగించి కోహ్లీ తన భార్య అనుష్కకు ఫ్లైయింగ్ కిస్లు ఇచ్చి తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఇదే క్రమంలో ఇప్పుడు వీరి వీడ్కోలు కూడా నెట్టింట్లో వైరల్గా మారింది.
ఇంగ్లాండ్ పర్యటన అనంతరం తిరుగుప్రయాణమైన విరాట్ కోహ్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఎయిర్ పోర్టు నుంచి మరో చోటుకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలోనే కోహ్లీ వచ్చేందుకు సమయముండగా అప్పటి వరకూ వేచి చూసిన అనుష్క శర్మ విరాట్ను కలిసి ప్రేమ పూర్వకంగా హగ్ చేసుకుని తన వీడ్కోలును తెలియజేసింది. ఆ తర్వాత కోహ్లీ వేరే కార్లో పయనమై వెళ్లిపోయాడు.
ఇప్పటికే కోహ్లీ లేకుండా ఆసియా కప్కు టీమిండియా బరిలోకి దిగేందుకు సిద్ధమైపోయింది. కోహ్లీ స్థానంలో ఉండి జట్టును నడిపించేందుకు రోహిత్ శర్మ జట్టు పగ్గాలు అందుకున్నాడు. కాగా, ప్రస్తుతమున్న జట్టులో ధోనీ స్థానం కీలకం కానుంది. ఇదిలా ఉంచితే కోహ్లీని జట్టులో ఎంపిక చేయలేదని ప్రముఖ మీడియా ఛానెళ్లు బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.