
హైదరాబాద్: విరాట్ కోహ్లీని అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు 'రన్ మెషిన్'. ఆ పేరుకు తగ్గట్టుగానే కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకతో నాగ్ పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ... చివరిదైన మూడో టెస్టులో కూడా డబుల్ సెంచరీ సాధించాడు.
ఫిరోజ్ షా కోట్లా వేదికగా లంకతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 238 బంతుల్లో 20 ఫోర్లతో డబుల్ సెంచరీని సాధించాడు. దీంతో వరుసగా రెండో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
కోహ్లీకి టెస్టుల్లో ఇది ఆరో డబుల్ సెంచరీ కాగా... ఈ సిరిస్లో వరుసగా రెండోది. తద్వారా ఆరు డబుల్ సెంచరీలు సాధించిన భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ల సరసన నిలిచాడు. అలాగే కెప్టెన్గా ఆరు డబుల్ సెంచరీలు చేసిన కోహ్లీ... వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా(5)ను అధిగమించాడు.
అంతేకాదు మూడు టెస్టుల సిరీస్ మూడు మ్యాచ్ల్లోనూ సెంచరీలు సాధించిన తొలి అంతర్జాతీయ కెప్టెన్గా కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో కోల్కతా వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేయగా, రెండో టెస్టులో 213 పరుగులు చేశాడు. మూడో టెస్టు తొలి రోజు అతను 156 పరుగులతో నాటౌట్గా నిలిచిన సంగతి తెలిసిందే.
శ్రీలంక సిరిస్లో కెప్టెన్గా, ఆటగాడిగా కోహ్లీ నమోదు చేసిన రికార్డులు:
* సొంతగడ్డ ఢిల్లీలో కోహ్లీకిదే తొలి డబుల్ సెంచరీ.
* ఢిల్లీ టెస్టులో కోహ్లీ సెంచరీ చేయడానికి తీసుకున్న బంతులు 110. టెస్టుల్లో కోహ్లీకి ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. ఇదే సిరిస్లో కోల్ కతా వేదికగా జరిగిన తొలి టెస్టులో 119 బంతుల్లో సెంచరీ చేశాడు. దాన్ని ఇప్పుడు అధిగమించాడు.
* ఈ ఏడాది శ్రీలంకపై కోహ్లీ చేసిన సెంచరీల సంఖ్య 6. నాలుగు టెస్టుల్లో, రెండు వన్డేల్లో సాధించాడు. ఒక ఏడాదిలో ఒకే జట్టుపై అత్యధిక శతకాలు సాధించిన డెస్మండ్ హేన్స్ (1984లో ఆస్ట్రేలియాపై), సచిన్ (1998లో ఆస్ట్రేలియాపై)లను కోహ్లీ సమం చేశాడు.
* టెస్టుల్లో కోహ్లీ చేసిన సెంచరీల సంఖ్య 20. అత్యంత వేగంగా 20 సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్లో కోహ్లీది ఐదో స్థానం. బ్రాడ్మన్ (55 ఇన్నింగ్స్లు), గావస్కర్ (93), హేడెన్ (95), స్టీవ్ స్మిత్ (99) అతడి కంటే ముందున్నారు.
* ఢిల్లీ టెస్టులో కోహ్లీ, విజయ్ల మూడో వికెట్ భాగస్వామ్యం 238 పరుగులు. లంకపై ఏ వికెట్కైనా భారత్కు ఇదే అత్యుత్తమం.
* క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యంత పిన్న వయసులో 5 వేల మైలురాయిని అందుకున్న భారత బ్యాట్స్మన్ కోహ్లీనే. సచిన్ 25 ఏళ్లకు ఈ ఘనత సాధించగా.. కోహ్లీకిప్పుడు 29 ఏళ్లు.
* ప్రపంచ క్రికెట్లో ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్లో కోహ్లి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ సీజన్లో కోహ్లీకిది 11వ సెంచరీ. సచిన్ 12 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
* కోహ్లీ అంతర్జాతీయ టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన తర్వాత అతడి కంటే ఎక్కువ సెంచరీలు చేసింది ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (21) మాత్రమే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.