

హైదరాబాద్: వరుస సిరీస్లతో ఎడతెరిపి లేకుండా క్రికెట్ ఆడుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో చివరి రెండు వన్డేలకు, ఆ తర్వాత జరిగే టీ20 సిరీస్కు కోహ్లి అందుబాటులో ఉండడని, అతడి స్థానంలో రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తాడని బీసీసీఐ తెలిపింది.
గత కొన్ని నెలలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నందున పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విశ్రాంతి ఇచ్చినట్లు సెలెక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. కోహ్లీ స్థానంలో ఎవరినీ ఎంపిక చేయడం లేదని కూడా బీసీసీఐ పేర్కొంది. ఐదు వన్డేల సిరీస్ ముగిసిన తర్వాత 3 మ్యాచ్ల టీ20 సిరిస్ ప్రారంభం కానుంది.
"గత కొన్ని నెలలుగా కోహ్లీపై పని ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం అతడికి విశ్రాంతి అవసరం. అదే విధంగా భారత్లో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్కు కోహ్లి సన్నద్ధం కావాలి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది" అని బీసీసీఐ మీడియాకు వెల్లడించింది. నేపియర్లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.