హైదరాబాద్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. తన కెరీర్లోనే అత్యధికంగా 911 పాయింట్లు సాధించాడు. ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్తో 2 పాయింట్లు సాధించి 911 మార్క్ను చేరుకున్నాడు. ఇంగ్లండ్ చేతిలో భారత్ సిరీస్ చేజార్చుకున్నా.. విరాట్ మూడు మ్యాచ్ల్లో వరుసగా 75, 45, 71 పరుగులు చేసి రెండు పాయింట్లను సంపాదించాడు.
అయితే మార్చి 1991లో ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ డీన్ జోన్స్ (918) తర్వాత అత్యధిక పాయింట్లు సాధించిన క్రికెటర్ కోహ్లీనే. భారత్పై చివరి రెండు వన్డేల్లో అజేయ శతకాలు (113 నాటౌట్, 100 నాటౌట్) బాదిన జోయ్ రూట్ (818)పాయింట్లతో ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి, రూట్ మధ్య 93 పాయింట్ల అంతరం ఉంది. పాక్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజమ్, రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, రాస్ టేలర్లను రూట్ వెనక్కి నెట్టి కెరీర్లోనే ఉత్తమ ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. ఆజమ్ (808), రోహిత్ శర్మ (806), డేవిడ్ వార్నర్ (803) టాప్-5లో ఉన్నారు.
బౌలింగ్ విభాగంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తొలిసారి టాప్-10లోకి దూసుకొచ్చాడు. ఇంగ్లండ్తో సిరీస్లో తొమ్మిది వికెట్లు పడగొట్టిన కుల్దీప్.. బౌలర్లలో 8 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ ఆరో ర్యాంక్కు చేరుకున్నాడు. భారత స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతుండగా... టాప్-10లో ఐదుగురు స్పిన్నర్లు రషీద్ ఖాన్ (2), తాహిర్ (7), ఆదిల్ రషీద్ (8), చాహల్ (10) ఉండటం విశేషం. ఆల్రౌండర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. షకీబ్, హఫీజ్, నబీ, సాంట్నెర్, మాథ్యూస్ వరుసగా ఐదు ర్యాంక్ల్లో ఉన్నారు.
జట్ల ర్యాంకింగ్ విషయానికి వస్తే.. భారత్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో గెలుపొందిన 127 పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఒక పాయింటు చేజార్చుకున్న టీమిండియా 121 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది.