హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను సాధించిన సంగతి తెలిసిందే. ఆటగాడిగా, కెప్టెన్గా రికార్డుల మీద రికార్డులు సృష్టించిన కోహ్లీ తాజాగా విడుదలైన మరో రిచ్ లిస్ట్లోనూ చోటు దక్కించుకున్నాడు.
ప్రముఖ సోషల్ మీడియా వెబ్సైట్ ఇనిస్టాగ్రామ్ బుధవారం తన రిచ్ లిస్ట్ను ప్రకటించింది. హాపర్హెచ్క్యూ.కామ్ విడుదల చేసిన డేటా ప్రకారం కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్పాన్సర్డ్ పోస్ట్లు పోస్టు చేసేందుకు గాను పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంటున్నాడు.
ఈ క్రమంలో అత్యధిక మొత్తం తీసుకుంటున్న అథ్లెట్ల జాబితాలో విరాట్ కోహ్లీ 9వ స్థానంలో ఉన్నాడు. బాస్కెట్ బాల్ సూపర్స్టార్ స్టీఫెన్ కర్రీ, ప్రొఫెషనల్ బాక్సర్ ప్లాయిడ్ మేవెథర్లను సైతం కోహ్లీ వెనక్కినెట్టాడు. పోర్చుగల్ పుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక, ఈ జాబితాలో క్రిస్టియానో రొనాల్డో తర్వాత నెయ్మార్, లియోనల్ మెస్సీ, డేవిడ్ బెక్హామ్, గారెత్ బేల్, ఇబ్రహిమోవిచ్, సురెజ్లాంటి ఫుట్బాల్ ప్లేయర్లు ఉన్నారు. 8వ స్థానంలో అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్షిప్ ఫైటర్ కానర్ మెక్గ్రెగర్ ఉన్నాడు.
తాజా డేటా ప్రకారం విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్పాన్సర్డ్ పోస్ట్ అభిమానులతో షేర్ చేసేందుకు గాను రూ.82 లక్షలు వసూలు చేస్తున్నాడు. కోహ్లీకి ఇన్స్టాగ్రామ్లో 2.3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కోహ్లీ తర్వాత పదో స్థానంలో గోల్డెన్ స్టేట్ వారియర్స్ బాస్కెట్బాల్ స్టార్ స్టీఫెన్ కర్రీ ఉన్నాడు.
ఈ జాబితాలో టాప్-10లో ఉన్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమే. ప్రస్తుతం సుదీర్ఘ పర్యటన కోసం విరాట్ కోహ్లీ... ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముగిసిన మూడు టీ20ల సిరిస్ను కోహ్లీసేన 2-1తేడాతో సొంతం చేసుకోగా... మూడు వన్డేల సిరిస్ను 1-2తో చేజార్చుకుంది.
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ ఐదు టెస్ట్లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభమవుతాయి. తొలి టెస్టు బర్మింగ్ హామ్ వేదికగా జరగనుంది.