
హైదరాబాద్: బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ (89, 91 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే, హాఫ్ సెంచరీ తర్వాత కోహ్లీ మరింత దూకుడుగా ఆడాడు.
హాఫ్ సెంచరీ తర్వాత కోహ్లీ దూకుడుని చూసి స్టేడియంలోని ప్రేక్షకులు ఆర్సీబీ ఆర్సీబీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఆర్సీబీ కాదని... టీమిండియాకు ఛీర్స్ చెప్పాలంటూ తన టీషర్ట్పై రాసి ఉనన టీమిండియాను చూపించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్సీబీ సొంత మైదానం కూడా చిన్నస్వామి స్టేడియం కావడం విశేషం.
ఇందుచేతనే మూడో వన్డేకు హాజరైన అభిమానులు టీమిండియా అని కాకుండా ఆర్సీబీ ఆర్సీబీ అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(131) సెంచరీ సాధించాడు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా రోహిత్శర్మ (119) సెంచరీతో చెలరేగడంతో పాటు కోహ్లీ (89) రాణించడంతో 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరిస్ విజేతను నిర్ణయించే వన్డేలో కోహ్లీసేన విజయం సాధించండంతో మూడు వన్డేల సిరిస్ను 2-1తో కైవసం చేసుకుంది.