కటక్: కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులోకి రాగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ నాతో మాట్లాడాడు. చెత్త షాట్లు ఆడకుండా నా సహజశైలిలో ఆడమని చెప్పాడు అని టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. వెస్టిండీస్తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దాంతో టీమిండియా 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ విజయంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ, శార్దూల్ ఠాకూర్లకు అండగా నిలిచి 31 బంతుల్లో అజేయంగా 39 పరుగులు చేశాడు.
కోహ్లీపై పిచ్చి ప్రేమ.. ఒంటిపై 16 ట్యాటూలు!!
మ్యాచ్ అనంతరం జడేజా మాట్లాడుతూ... 'మామూలుగా కటక్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. సింగిల్స్ తీస్తూ.. బౌండరీలు బాదాలనుకున్నాం. చివరి వరకు క్రీజులో ఉండి కోహ్లీ మ్యాచ్ను ముగించాలనుకున్నాడు. కానీ అలా జరగలేదు. చెత్త షాట్లు ఆడకుండా నా సహజశైలిలో ఆడమని కోహ్లీ చెప్పాడు. ఆఖరి బంతి వరకు నిలబడితే తప్పక విజయం సాధిస్తామని తెలుసు. శార్దూల్, నేను అదే ప్రణాళికతో బ్యాటింగ్ చేశాం' అని అన్నాడు.
'రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మంచి శుభారంభం చేశారు. కానీ.. మిడిల్ ఓవర్లలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయాం. ఇది సహజమే. కోహ్లీ ఇన్నింగ్స్ అద్భుతం. శార్దూల్ క్రీజులోకి రాగానే ఒకటే చెప్పా, బంతి వికెట్ మీదికి వస్తుంది.. చూసి ఆడు అన్నా. అతడు బాగా బ్యాటింగ్ చేసాడు. నాపై ఒత్తిడి తగ్గించాడు. ఈ సిరీస్లో ఎన్నో క్యాచ్లను నేలపాలు చేసాం. ఫ్లడ్ లైట్ల వెలుతురు, మంచు కూడా క్యాచ్లు మిస్ అవ్వడానికి కారణం కావొచ్చు. పరిమిత ఓవర్లలో క్యాచ్లు చాలా ముఖ్యం. జట్టులో అందరూ యువకులే ఉన్నారు. వచ్చే సిరీస్లో ఫీల్డింగ్పై మరింత దృష్టి సారిస్తాం' అని జడేజా తెలిపాడు.
'పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించగలని నాకు నేను నిరూపించుకోవాలి. అంతేకాని.. ప్రపంచంలో ఉన్న అందరికీ నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కీలక పోరులో మంచి ఇన్నింగ్స్ ఆడాను. ఈ ఏడాది వన్డేలు ఎక్కువగా ఆడలేదు. వచ్చిన కొద్ది అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకున్నా. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో సత్తా చాటాలని నిర్ణయించుకున్నా. టీమిండియా మంచి విజయంతో ఈ ఏడాదిని ముగించింది' అని జడేజా చెప్పుకొచ్చాడు.